RBI | న్యూఢిల్లీ, మే 8: దేశాన్ని డిజిటలైజేషన్ దిశగా నడిపించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో నిర్ణయం తీసుకున్నది. నగదు రూపేణా రూ.20,000కు మించి ఎవ్వరికీ రుణాలనూ ఇవ్వరాదని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ లేఖను సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసినట్టు ప్రముఖ వార్తా ఏజెన్సీ రాయిటర్స్, ఈ సమాచారం తెలిసిన అధికార వర్గాల్లో ఇద్దరు చెప్తున్నారు. ‘ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961లోని సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం రూ.20,000కు మించి ఎవ్వరికీ నగదు రుణం ఇవ్వరాదన్న నిబంధనను తప్పక అమలు చేయాలి’ అని సదరు లేఖలో ఎన్బీఎఫ్సీలకు రిజర్వ్ బ్యాంక్ గట్టిగా తెలియజేసింది.
పాత పెద్ద నోట్ల (రూ.500, రూ.1,000) రద్దు నేపథ్యంలో ఏర్పడిన నగదు కొరత దృష్ట్యా డిజిటల్ ఎకానమీపై కేంద్ర ప్రభుత్వం నజర్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్నింటా ఆన్లైన్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ ద్రవ్యవ్యవస్థలో మళ్లీ నగదు చలామణి పెరిగింది. కరెన్సీల్లో లావాదేవీలు ఎప్పట్లాగే జరుగుతున్నాయి. దీంతో నగదు చలామణి కట్టడికి నిబంధనల్ని గట్టిగా అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయించుకున్నదని, అందులోభాగంగానే ఎన్బీఎఫ్సీల ద్వారా నగదు రుణాలు రూ.20,000కే పరిమితం చేసిందని అంటున్నారు. ఇదిలావుంటే రుణాల మంజూరులో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్లో భారీ అవకతవకల్ని ఆర్బీఐ గుర్తించిన విషయం విదితమే. బంగారం నాణ్యతను గుర్తించడంలో, తూకంలో, నగదు రుణాల పరిమితిలో నిబంధనల్ని సంస్థ అస్సలు పట్టించుకోలేదని తేలింది. కస్టమర్ అకౌంట్ చార్జీల్లోనూ పారదర్శకత లోపించిందన్న ఆర్బీఐ.. కొత్త కస్టమర్లకు బంగారం తాకట్టుపై రుణాలను ఇవ్వరాదని ఆ సంస్థను ఆదేశించింది. ఈ పరిణామం కూడా ఎన్బీఎఫ్సీలపై తాజా ఆదేశాలకు కారణమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే కరోనా తర్వాత భారీగా పెరిగిన రిటైల్ రుణాల దృష్ట్యా కూడా ఆర్బీఐ ఈ చర్యలకు దిగి ఉండవచ్చన్న వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) డిజిటల్ యాప్ ‘బీవోబీ వరల్డ్’పై గతంలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేసింది. పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతూ నిరుడు అక్టోబర్ 10న ఈ యాప్లోకి కొత్త ఖాతాదారుల రాకపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని బుధవారం తొలగించింది. ఇక గత వారం బజాజ్ ఫైనాన్స్పైనున్న ఆంక్షలనూ ఆర్బీఐ తీసేసిన సంగతి విదితమే. ఈకామ్, ఇన్స్టా ఈఎంఐ కార్డ్ల ద్వారా రుణాలను మళ్లీ ఇచ్చుకోవచ్చని చెప్పింది. కాగా, నిబంధనల్ని ఉల్లంఘించిన కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లపైనా గతంలో ఆర్బీఐ కొరడా ఝుళిపించినది తెలిసిందే.