PWM | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను వచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ (పీడబ్ల్యూఎం) కొత్త నిబంధనలతో ప్యాకేజింగ్ ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరగనున్నాయి. రీసైక్లింగ్కు, భూమిలో తేలిగ్గా నశించిపోయేందుకు అనువుగా ఉన్న ప్లాస్టిక్ను మాత్రమే ఉపయోగించాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ప్లాస్టిక్ను వినియోగిస్తే ప్యాకేజింగ్ ఖర్చులు భారీగానే పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వివిధ కంపెనీలు ప్యాకేజింగ్ కోసం ప్రస్తుతం సదరు ఉత్పాదక వ్యయంలో 5 నుంచి 13 శాతం వరకు ఖర్చు చేస్తుండగా, కొత్త నిబంధనలతో ఈ ఖర్చు మరో 3-4 శాతం వరకు పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారం వినియోగదారులపైనే పడుతుందని వారు అంటుండటం గమనార్హం. దీంతో ఆయా రకాల ఉత్పత్తుల ధరలు మార్కెట్లో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇదే జరిగితే తమ వ్యాపారంపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చని అటు వ్యాపారులు, ఇటు పరిశ్రమ ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం ఏటేటా గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతున్నదని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నా… దీని ఉత్పత్తి, వినియోగం మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ ప్లాస్టిక్కు డిమాండే ఉంటున్నది. 2000వ సంవత్సరంలో 234 మిలియన్ టన్నుల మేర ప్లాస్టిక్ ఉత్పత్తి అవగా, 2019 నాటికి ఇది 460 మిలియన్ టన్నులకు చేరుకున్నది. అయితే పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రపంచ దేశాలు ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే మన దేశంలో పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పీడబ్ల్యూఎం నిబంధనలను సవరించి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కఠినంగా అమలు చేయాలని సంకల్పించింది.