జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. గతేడాదిలాగే ఈ సారి కూడా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 2021-22 ఏడాదికి సంబంధించి మొత్తం రుణాల లక్ష్యం రూ.5508.07 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో వ్యవసాయ అనుబంధ రుణాల కోసం రూ.2756.63 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రూ.836.30 కోట్లు పారిశ్రామిక వర్గాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక విడుదల చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి రుణాల లక్ష్యం 31.13 శాతం పెరిగింది. గత వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.1645 కోట్లు కాగా.. రూ.1184 కోట్ల(72శాతం) రుణాలను పంపిణీ చేశారు. ఆయా రంగాలకు కేటాయించిన లక్ష్యాలను బ్యాంకర్లు ఖరీఫ్ సీజన్లోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
వికారాబాద్, జూన్ 24, (నమస్తే తెలంగాణ): జిల్లా 2020-21 వార్షిక రుణ ప్రణాళికను నాబార్డు ఆధ్వర్యంలో లీడ్ బ్యాంకు అధికారులు ఖరారు చేశారు. రుణ ప్రణాళికను రెండు రోజుల క్రితం కలెక్టర్ పౌసుమిబసు గూగుల్ మీట్లో విడుదల చేశారు. గతేడాదిలాగే ఈసారి కూడా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించారు. పంట రుణాలతోపాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, మహిళా సంఘాలు, ఇతర రుణాలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. లక్ష్యం ఆధారంగా బ్యాంకులకు రుణాన్ని మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.
వికారాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం దాదాపు 6 లక్షల ఎకరాలు ఉంది. ప్రధాన పంటలుగా పత్తి, వరి, కందితో పాటు కూరగాయలు సాగు చేస్తున్నారు. అధిక శాతం వర్షాధార పంటలే పండిస్తున్నారు. తక్కువ మంది రైతులు బోర్లు, బావుల ఆధారంగా పంటలు వేస్తున్నారు. ఏటా పంట పెట్టుబడుల కోసం రైతులు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అందించే రుణాలపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈసారి రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళిక రూ.5,508.07 కోట్లు లక్ష్యంగా ఖరారు చేశారు. ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2,756.63 కోట్లు, పారిశ్రామిక వర్గాలకు రూ.836.30, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.1049.91, అప్రాధాన్యత రంగాలకు రూ.865.23 కోట్లుగా ప్రణాళికలో పేర్కొన్నారు.
2020-21 వార్షిక సంవత్సరంతో పోల్చితే ఈసారి రుణ ప్రణాళికలో 31.13 శాతం అధికంగా నిధులు కేటాయించారు. గతేడాది రూ.1645 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.5508.07 కోట్లు ఇచ్చారు. ఈ రుణాలను 2,58,379 మందికి సంబంధిత ఖాతాల్లో వేయనున్నారు. వంద శాతం రుణాలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా రంగాలకు కేటాయించిన లక్ష్యాలను బ్యాంకర్లు వానకాలం సీజన్లోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా గ్రూపులకు అర్హత మేరకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. గడువు మించిపోతున్న తరుణంలో ఆగమేఘాల మీద కాకుండా బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తే రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంటుంది. రుణ ప్రణాళికలో పేర్కొన్న ప్రకారం పంట, వ్యవసాయ అనుబంధ రంగాలకు సకాలంలో పూర్తి స్థాయిలో రుణాలు అందజేస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆయా రంగాలకు కేటాయించిన లక్ష్యాలను బ్యాంకర్లు వానకాలం సీజన్లో పూర్తి చేయాలని కలెక్టర్ పౌసుమిబసు ఆదేశాలు జారీచేశారు. రైతు బంధు డబ్బులు ఇవ్వడంలో జాప్యం చేయవద్దని, రైతుల ఖాతాలను హోల్డ్లో ఉంచొద్దని సూచించారు. దీంతో పాటు అర్హులైన కొత్త రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని, దీర్ఘకాలిక రుణాలు సకాలంలో అందించి వ్యవసాయ శాఖ అధికారులతో లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. మత్య్సశాఖకు సంబంధించి పెండింగ్లో ఉన్న రుణాలు వెంటనే అందించనున్నారు.
గతేడాది రూ.1645 కోట్ల రుణ లక్ష్యం కాగా.. 1.50 లక్షల మంది రైతులకు రూ.1184 కోట్లు(72శాతం) అందజేశారు. ఈ ఏడాది 97 వేల మంది రైతులకు వానకాలం కింద రూ.1028 కోట్లు కాగా.. యాసంగిలో 65 వేల మంది రైతులకు సంబంధించి రూ.687 కోట్లు ఇచ్చారు. మహిళా సంఘాలకు గతేడాది రూ.304 కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా.. రూ.305 కోట్లు ఇచ్చి లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సైతం 100 శాతం రుణాలు అందజేశారు.
సెక్టార్ | 2021-22 | శాతం |
వ్యవసాయ అనుబంధ రంగాలు | 2756.63 | 50.04 |
పారిశ్రామిక వర్గాలు | 836.30 | 15.18 |
ప్రాధాన్యత రంగాలు | 1049.91 | 19.07 |
అప్రాధాన్యత రంగాలు | 865.23 | 15.71 |