వికారాబాద్ /రంగారెడ్డి, ఏప్రిల్ 19, (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి గతేడాది నుంచి విలయతాండవం చేస్తోంది. ఇటీవల వైరస్ తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు ప్రత్యేక బోధన ప్రారంభించింది. ప్రైవేట్ టీచర్లు తమ బతుకు గాడిన పడిందని సంబరపడే సమయంలో మళ్లీ రెండు నెలలకే కరోనా వైరస్ విజృభించింది. పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు వైరస్ సోకడంతో ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు మళ్లీ ఉపాధి లేక రోడ్డున పడ్డారు. ప్రైవేట్ టీచర్ల కష్టాలను గుర్తించిన సర్కార్ వారికి అండగా నిలిచేందుకు నెలకు రూ.2వేలు, 25 కిలోల బియ్యం అందించి ఆదుకోవాలని నిర్ణయించింది.
లబ్ధిదారుల ప్రక్రియ పూర్తి
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 153 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 1,755 మంది టీచింగ్ స్టాఫ్, 84 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ గుర్తించింది. వారందరికీ నేటి నుంచి రూ.2వేల నగదు సాయం అకౌంట్లలో జమచేయనుండగా.. రేపటి నుంచి 25కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2వేలు, 25 కేజీల బియ్యం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది జిల్లా యంత్రాంగం.
హర్షం వ్యక్తం చేస్తున్న టీచర్లు
కరోనా కారణంగా గతేడాది ఫిబ్రవరి నుంచి విద్యాసంస్థలు మూసివేయడంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేక వేతనాలు రాక రోజువారీ కూలీ, ఉపాధి హామీ, వ్యవసాయ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. వీరి సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో నెలకు రూ.2వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని, ఈనెల 20లోగా పంపించాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి 15 వరకు 26వేల మంది ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది ఆన్లైన్లో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 16వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బందిని అర్హులుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తేల్చారు. వీరికి ఆర్థిక సాయంతోపాటు రేషన్ దుకాణాల ద్వారా రేపటి నుంచి 25 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేయనున్నారు. జిల్లాలో ఆర్థిక సాయం కోసం రూ.3.20 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. మరోవైపు 25 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేసేందుకుగాను 4వేల క్వింటాళ్ల సన్నబియ్యాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధంగా ఉంచారు. జిల్లా వ్యాప్తంగా 1,491 ప్రైవేట్ పాఠశాలలుండగా బోధన సిబ్బంది 23,838 మంది, బోధనేతర సిబ్బంది 2228 మంది ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ కూడా చదవండి…
సీఎం కోలుకోవాలని మంత్రులు హరీశ్, సత్యవతి ఆకాంక్ష