న్యూఢిల్లీ, ఆగస్టు 8: మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సెగ.. భారత్కు గట్టిగానే తగులుతున్నది. దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోకి దిగుమతైన ముడి చమురు విలువ 49 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే వ్యవధిలో 39 బిలియన్ డాలర్లుగానే ఉన్నది. నిజానికి గతంతో పోల్చితే ఈసారి క్రూడాయిల్ దేశంలోకి తక్కువగానే వచ్చింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. నిరుడు ఏప్రిల్-జూన్లో 73 మిలియన్ టన్నులు రాగా, ఈ ఏప్రిల్-జూన్లో 59.7 మిలియన్ టన్నులే దిగుమతైంది. అయినప్పటికీ 10 బిలియన్ డాలర్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇందుకు కారణం గల్ఫ్ ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు, హొర్ముజ్ జలసంధిలో రవాణాకు అడ్డంకులేనంటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్లే 18 శాతం దిగుమతులు తగ్గినా.. 26 శాతం చెల్లింపులు పెరిగాయని పేర్కొంటున్నారు.
హొర్ముజ్ కీలకం
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో హొర్ముజ్ జలసంధిలో రవాణా చిక్కుల్లో పడింది. అమెరికాకు సౌదీ, కువైట్, యూఏఈ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాలు అండగా ఉంటున్నాయన్న ఆగ్రహంతో ఇరాన్.. హొర్ముజ్ జలసంధిలో వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నది. దీంతో రవాణా సాగడం లేదు. ప్రపంచ ముడి చమురు సరఫరాల్లో హొర్ముజ్ మీదుగానే 20 శాతం జరుగుతున్నది. ఇక భారత్కు వచ్చే దిగుమతుల్లో దాదాపు 40 శాతం ఈ మార్గం గుండానే వస్తున్నది. కాగా, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుండటంతో అక్కడ ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తికి విఘాతం కలుగుతున్నది. దీంతో భారత్కు ముడి చమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతుండగా, డిమాండ్కు తగ్గ సైప్లె లేక ధరలూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖర్లో మొదలైన గల్ఫ్ వార్.. ఇప్పటికీ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఒకానొక దశలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 125 డాలర్లు పలుకడం గమనార్హం. హొర్ముజ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పెరుగుతున్న రవాణా ఖర్చులూ భారత్ వంటి భారీ చమురు దిగుమతి దేశాలకు పెను సమస్యగా పరిణమిస్తున్నాయి.
రష్యాపైనే ఆధారం
గల్ఫ్ వార్ నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లపైనే భారత్ ఆధారపడుతున్నది. ఏప్రిల్-జూన్లో టన్నుకు సగటున 2,408 డాలర్లు చెల్లించి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో యూఏఈ నుంచి సగటున 2,213 డాలర్లకు ఒక్కో టన్నును భారత్ దిగుమతి చేసుకున్నది. కాగా, దేశీయ ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతానికిపైగానే ఈ ఏప్రిల్-జూన్లో నమోదైంది. 14.6 శాతంతో యూఏఈ రెండో స్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో సౌదీ అరేబియా (9.9 శాతం), వెనెజువెలా (5.2 శాతం), ఒమన్ (4.5 శాతం) ఉన్నాయి. ఇదిలావుంటే రష్యాపై అమెరికా విధిస్తున్న ఆంక్షల ప్రభావంతో భారతీయ ఎగుమతులపై అమెరికాలో అదనంగా 100 శాతం వరకు సుంకాలు పడే ప్రమాదం ఉన్నదని జీటీఆర్ఐ అంచనా వేస్తున్నది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు ఆపకపోతే టారిఫ్ల దెబ్బ ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది.