న్యూఢిల్లీ : బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సెర్టాయిడ్స్ తక్కువగా తీసుకోవాలని కోరారు. కరోనా దుష్ప్రభావాలను నివారించేందుకు ప్రజలు అధిక మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారని, వారికి తక్కువ మొత్తంలో ఇవ్వాలని వైద్యులకు సూచించారు. తద్వారా దేశవ్యాప్తంగా మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్ బాధితులకు చికిత్సలు చేసే సమయంలో వైద్యులు ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటించాలని కోరారు. చికిత్స నియమాలను విస్మరించడం వల్లే కొవిడ్కు సంబంధించిన సమస్యలు దేశవ్యాప్తంగా వస్తున్నాయన్నారు. కరోనాను నియంత్రించేందుకు సైతం ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.