నాగర్కర్నూల్ : మండల స్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కమిటీలకు జడ్పీటీసీలను శాశ్వత సభ్యులుగా పరిగణించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం స్థానిక తిరుమల ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ అధ్యక్షతన జరిగిన జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండల అభువృద్ధి సమావేశాలకు జడ్పీటీసీ సభ్యలను ఆహ్వానించడం లేదని తనకు ఫిర్యాదు చేశారన్నారు. దీనిని ఇక్కడే పరిష్కరిస్తూ ఇక నుంచి వారిని శాశ్వత సభ్యులుగా ప్రకటిస్తున్నందున సహకార శాఖ, మార్కెటింగ్ తదితర అన్ని మండల స్థాయి సమావేశాలకు జడ్పీటీసీలను విధిగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా సభ్యుల కోరిక మేరకు జిల్లా దవాఖాన అభివృద్ధి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అన్ని జిల్లాలలో నడుస్తున్నట్లుగా నాగర్ కర్నూల్ జిల్లాలో సైతం మన ఇసుక వాహనం ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల రిజర్వాయర్ ముంపులో భూములు కోల్పోయిన వారికి కొంతమంది ఇంకా నష్టపరిహారం అందలేదన్నారు. వీటిపై పూర్తి వివరాలు అందిస్తే చర్యలు తీసుకుంటామని సభ్యులకు హామీనిచ్చారు.
అదేవిధంగా ఇంతవరకు బిల్లులు పెండింగులో ఉన్న రైతు వేదికలు, వైకుంఠ ధామాల వివరాలు ఇవ్వాల్సిందిగా వ్యవసాయ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు మండలానికి కనీసం ఒకటి వీలు ఉంటే మరిన్ని ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోసేందుకు మార్చి నుంచి నిధులు విడుదల చేస్తామన్నారు. అయితే దీనిని నవంబర్ నుంచి అమలు చేసేవిధంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా సూచించారు.
కొత్త గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలకు ఎన్. ఆర్.ఈ.జి.యస్. మెటీరియల్ కంపోనెంట్ కింద గ్రామ పంచాయతీల నిర్మాణాలు చేపట్టేందుకు తీర్మానం చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పని చేస్తే స్వయం తృప్తి ఉంటుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జెడ్పి చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ఎంపీ పి. రాములు, మండలి సభ్యులు విప్ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ మను చౌదరి, జడ్పీ సీఈవో ఉషా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : రెండంతస్తుల భవనం పైనుంచి పడి బాలుడు మృతి
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు