ఊట్కూర్ (కృష్ణ) : నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడేబల్లూరు టైరోడ్డు సమీపంలోని కృష్ణానది తీరం ఉన్న శ్రీ ఓంకారాశ్రమం ( Omkarashram ) లో బుధవారం గురు పౌర్ణమి ( Guru Purnima ) మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఓంకారానందగిరి గురువును దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా గురుపూజ, పాదసేవ, ధ్యానం, భగవద్గీత పారాయణం, భజనలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గురువు శిష్యురాలు శివ చైతన్యానంద రచించిన భక్తి గీతాల సీడీని ఆవిష్కరించారు. అదేవిధంగా శ్రీ ఓంకారాశ్రమం అధికారిక వెబ్సైట్ను ప్రారంభించారు.
ఓంకారానంద స్వామి మాట్లాడుతూ గురువు చూపే మార్గమే మనిషిని అజ్ఞానాంధకారం నుంచి జ్ఞాన వెలుగులోకి నడిపిస్తుందని అన్నారు. గురువు బోధలను ఆచరణలో పెట్టినవారే నిజమైన శిష్యులని పేర్కొన్నారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ఎల్కోటి నారాయణరెడ్డి, విఠోబా, శివన్న గౌడ్, భక్తులు పాల్గొన్నారు.