న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్తో నేషనల్ హీరో అయిపోయింది వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను. రెండు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్ వెయిట్లిఫ్టింగ్లో మెడల్ సాధించిపెట్టిన ఆమెపై ప్రశంసలతోపాటు అవార్డులు, రివార్డులు కూడా కురుస్తున్నాయి. తాజాగా డొమినోస్ పిజ్జా కూడా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మీరాబాయికి పిజ్జా అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని మెడల్ గెలిచిన తర్వాత ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ముందు నేను పిజ్జా తింటాను. దానిని తిని చాలా రోజులైంది అని ఆమె చెప్పింది.
మీరాబాయి చెప్పిన మాట విన్న డొమినోస్ పిజ్జా వెంటనే ఓ ట్వీట్ చేసింది. మెడల్ను తీసుకొస్తున్నందుకు కంగ్రాట్స్. వంద కోట్లకుపైగా భారతీయుల కలలను సాకారం చేశావు. అందుకే నీకు జీవితకాలం ఉచితంగా పిజ్జా ఇవ్వడం కంటే సంతోషం మాకు మరొకటి ఉండదు అని డొమినోస్ ట్వీట్ చేసింది.