Kadiyam Srihari | వేలేరు, డిసెంబర్ 10 : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరికి చుక్కెదురైంది. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదంటూ జనం నిలదీశారు. జనాన్ని శాంతిపజేసేందుకు ప్రయత్నించినా.. ససేమిరా అనడంతో ఆయన వెనుదిరిగాల్సిన పరిస్థితి వచ్చింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాశపల్లి గ్రామంలో బుధవారం కడియం శ్రీహరి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో పలువురును ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లను ఎవరికి ఇచ్చారంటూ కడియంను నిలదీశారు. అర్హులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. భూమి జాగ లేని పేదలకు ఇవ్వకుండా ఎమ్మెల్యే తన అనుచరులకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని మహిళలు, గ్రామస్తులు మండిపడ్డారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. అక్కడే ఉన్న పోలీసులు మహిళలను సముదాయించే ప్రయత్నం చేస్తున్న సమయంలో కడియం ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.