హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/ ముషీరాబాద్: మహిళా సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అమలుచేస్తున్న పథకాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. మహిళా సంక్షేమం కోసం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, బాలామృతం, కేసీఆర్కిట్స్తోపాటు వీ హబ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటుచేసిన హెల్ప్డెస్క్, మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలు, న్యూట్రిగార్డెన్లు బాగున్నాయని కితాబిచ్చింది. మహిళా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, మహిళా కమిషన్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించింది. డాక్టర్ హీనాకుమార్ గవిత్ నేతృత్వంలోని ‘మహిళా సాధికారత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ’ రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్తో సమావేశమైంది. మహిళల భద్రత కోసం మహిళా కమిషన్ చేపట్టిన చర్యలను సమీక్షించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించా రు. రాష్ట్రంలోని మహిళా షెల్టర్ హోమ్లు, సఖి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను మహిళా, శిశుసంక్షేమశాఖ కమిషనర్ దివ్య దేవరాజ్ కమిటీ సభ్యులకు వివరించారు. కమిషన్ తరఫున పలు సిఫారసులను కమిటీకి సమర్పించారు. సమావేశంలో మహిళా కమిషన్ సభ్యురాలు షహిన్ అఫ్రోజ్, ఈశ్వరీబాయ్, ఉమాదేవి, గద్దల పద్మ, సుధమ్ లక్ష్మి, రేవతీరావు పాల్గొన్నారు.
వీ హబ్ కృషి కొనసాగాలి
ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను, మహిళా స్టార్టప్లను ప్రోత్సహించడంలో వీ హబ్ సహకారాన్ని పార్లమెంటరీ స్టాండిం గ్ కమిటీ చైర్పర్సన్ హీనా గవిత్ ప్రశంసించారు. మహిళా స్టార్టప్లు అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం ఎంతో థ్రిల్లింగ్గా ఉన్నదన్నారు. గుజరాత్, జమ్ముకశ్మీర్లతో వీ హబ్ కలిసి పనిచేయడం ఆసక్తికరంగా ఉన్నదని చెప్పారు. మహిళా సాధికారత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సోమవారం వీ హబ్ను సందర్శించి, మహిళా స్టార్టప్లతో, సీఈవో రావుల దీప్తితో ముచ్చటించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జర్నాదాస్ బైద్య, లాకేట్ ఛటర్జీ, మమతా మోహన, రమ్య హరిదాస్, మాలోతు కవిత, వంగా గీత, వందనా చౌహాన్, శతాబ్దిరాయ్, గోమతిసాయి, శర్మిష్ఠ సేతి, రితి పాటక్, సరోజ్పాండే పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పథకాలు చరిత్రాత్మకం: మంత్రి గంగుల
మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి తదితర పథకాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించడం పట్ల మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ చరిత్రాత్మకమైనవన్న విషయం దీంతో తేటతెల్లమైందన్నారు. సంక్షేమ పథకాల ఫలాలను ఆడపడుచులు అందుకుంటున్నారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.