KCR | మంచిర్యాల : ఈ ఐదు నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఆగమైంది.. సీఎం రేవంత్ ఒట్లు నమ్మేటట్టు లేదు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంచిర్యాలలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్ల ఉండే. ఈ ఐదు నెలల్లోనే ఇంత ఆగం ఎందుకు అయిందో ఆలోచన చేయాలి. ఐదు నెలల కింద సాగునీళ్లకు, మంచినీళ్లకు, కరెంట్కు ఇబ్బంది లేదు.
సాగు, తాగునీరు, కరెంట్ విషయంలో ఈ ఐదు నెలల్లోనే ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాలి. కేసీఆర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. మరి ఇవాళ ఎందుకు కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయి. అన్ని వర్గాల ప్రజలకు తాగునీళ్లు అందించాం. మరి పరిశుభ్రమైన నీళ్లు ఎక్కడ మాయం అయ్యాయి. కేసీఆర్ ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి చెక్కులు ఎక్కడ మాయం అయ్యాయి. అర చేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారెంటీలని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు. కేసీఆర్ ఒక కోటి రుణం మాఫీ చేసిండు. రూ. 2 లక్షలు రుణం తీసుకుంటే డిసెంబర్ 9న మాఫీ చేస్తా అన్నాడు. కానీ అది అమలు కాలేదు. రైతుబంధు కూడా అందరికీ రాలేదు. కరెంట్ కోతలు మొదలయ్యాయి. వీటిపై ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం సమకూర్చిన రైతుబంధు డబ్బులు ఎటు పోయాయి..? అడ్డగోలు హామీలిచ్చిన సీఎం ఇప్పుడు ఏ ఊరికి పోతే ఆ ఊర్లో దేవుని మీద ఒట్టు పెడుతున్నాడు. ఈ ఒట్టు నమ్మేటట్టు ఉన్నదా..? అంటే లేదు. కాంగ్రెస్ నాయకులు ఏమీ చేయరు అని మనకు అర్థమైంది అని కేసీఆర్ తెలిపారు.
ఆరు గ్యారెంటీల్లో ఒకటి ఫ్రీ బస్సు అమలైంది. ఆ ఫ్రీ బస్సుతో ఆడోళ్లు సిగలు సిగలు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఆటో రిక్షా కార్మికుల బతులుకు ఆగమయ్యాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరు మీద అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడేమో పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం లేదు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ఊడ్చే పిరస్థితి లేదు. హరితహారం చెట్లు, పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి అని కేసీఆర్ తెలిపారు.
చెన్నూరు ఎత్తిపోతల పథకం ఆపేశారు. మంచిర్యాల ప్రజల కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంజూరు చేస్తే అది మొండి గోడలతో కనబడుతుంది. దాన్ని ఎందుకు ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అన్ని రకాల పనులను నిలిపివేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్నాడు సీఎం అని కేసీఆర్ ధ్వజమెత్తారు.