KCR | ముఖ్యమంత్రిని నిలదీస్తే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ నీ గుడ్లు తీసుకుని గోలీలు ఆడుతా.. నీ పేగులు మెడలేసుకుంటా.. నీ లాగుల తొండలు సొర్రకొడతా.. నిన్ను జైల్లో పెడతా అంటున్నాడని పేర్కొన్నారు. జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? అని ప్రశ్నించారు. తాను జైళ్లకు భయపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని అడిగారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల పట్టణంలో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల రెసిడెన్షియల్ పాఠశాలల పెట్టినం. ఇవాళ వాటిని చూసే దిక్కులేదు. పిల్లలు విషాహారం తిని ఆస్పత్రి పాలవుతున్నారు.. కొన్నిచోట్ల చనిపోతున్నారు. అన్ని రకాల నిర్లక్ష్యం, ఒక అహంకారం, మొండి మూర్ఖ వైఖరితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను శిక్షిస్తుంది.’ అని మండిపడ్డారు. ‘ రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్నుకొట్టింది.. రైతాంగానికి రైతుబంధు ఇవ్వలే.. సాగునీరు ఇవ్వలే.. కరెంటు ఇవ్వలే.. చివరకు వడ్లు కూడా కొంటలేదన్నారు. ఇవే పరిస్థితులు ఉంటే.. ఐదెకరాలకే రైతుబంధు వేస్తానని.. దున్నినోడికే రైతుబంధు వేస్తానని అంటారని తెలిపారు. ఐదెకరాలకే రైతుబంధు వేస్తా అంటే ఆరు ఎకరాలు, ఏడు ఎకరాలు ఉన్నోడు ఏం పాపం చేసిండు.. ఏడెకరాలు ఉన్నోడికి రైతుబంధు రావద్దా? అని ప్రశ్నించారు.
గోదావరి నదిని ఎత్తుకుని పోతా అని నరేంద్ర మోదీ అంటున్నాడు. మీకు అన్యాయం చేస్తానని మోదీ అంటుంటే.. ఈ ముఖ్యమంత్రి ఏమో ఏం మాట్లాడట్లేదు.. కృష్ణానదిని ఆల్రెడీ కేంద్రానికి అప్పగిచ్చిండు. ఇవాళ గోదావరిని తీసుకుపోయి తమిళనాడుకు ఇస్తా అంటే కూడా నోరు తెరవట్లేదు. కృష్ణా, గోదావరి నదులు పోతే మనల్ని ఎవరు కాపాడాలని అడిగారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, ఆస్తిత్వం కాపాడాలన్నా.. నదుల నీళ్లలో మన హక్కులు మనకు రావాలన్నా.. ఢిల్లీ నుంచి నిధులను తీసుకురావాలన్నా.. సింగరేణి ప్రైవేటుపరం కావద్దన్నా.. యథావిధిగా సంక్షేమ పథకాలు జరగాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని తెలిపారు. వీటి మీద నిలదీస్తే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని.. కేసీఆర్ నీ గుడ్లు తీసుకుని గోలీలు ఆడుతా.. నీ పేగులు మెడలేసుకుంటా.. నీ లాగుల తొండలు సొర్రకొడతా.. నిన్ను జైల్లో పెడతా అంటున్నాడు.’ అని కేసీఆర్ చెప్పారు. జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? అని ప్రశ్నించారు. నేను జైళ్లకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని అడిగారు. ఆనాడు చాలా కష్టపడి చావు నోట్లో తలకాయ పెట్టి.. 15 ఏండ్లు రాజీలేని పోరాటం చేసి.. మీ బిడ్డగా మీ దీవెనతో తెలంగాణను తీసుకొచ్చినా అని అన్నారు. తన ముందే తెలంగాణకు అన్యాయం చేస్తమంటే నా ప్రాణాలను బలి పెట్టి అయినా పోరాడతా తప్ప.. మౌనం పాటించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. తప్పకుండా అన్ని వర్గాల ప్రజల కోసం అండగా ఉంటానని తెలిపారు.
దళిత బిడ్డల కోసం దళితబంధు తెచ్చినమని.. 1.30లక్షల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు మంజూరు చేసినమని కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డబ్బులు అన్నింటినీ వాపస్ తీసుకుందని తెలిపారు. దళితులు అర్హులు కారా? వాళ్లకు ఇచ్చిన డబ్బును ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఎందుకు వాళ్లకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గిరిజిన బిడ్డలకు బ్రహ్మాండంగా 4.5 లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చినం.. వాళ్లకు రైతుబంధు ఇచ్చినం.. రైతుబీమా చేసినం.. ఇవాళ గిరిజన రైతులు ఎవరికీ కూడా రైతుబంధు వేయలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా పంపించినా.. ఈ సంవత్సరం రంజాన్ తోఫా వచ్చిందా? ఇఫ్తార్ విందులు జరిగినయా? అని ప్రశ్నించారు. ‘ వాళ్లు ఎవరినీ గౌరవించరు.. హిందువులను గౌరవించరు. ముస్లింలను గౌరవించరు.. దళితులను గౌరవించరు.. లంబాడీలు, గిరిజనులకు ఇవ్వాల్సింది ఇయ్యరు.. రైతులను ముంచుతరు.. విద్యార్థులను ముంచుతరు.’ అని మండిపడ్డారు. నాలుగు నెలల్లోనే ఇంత రాక్షస పాలన జరుగుతుందని.. ఈ అన్యాయాలను అరికట్టాలంటే.. మనకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ బలం.. తెలంగాణ బలం.. బీఆర్ఎస్కు మీరిచ్చే శక్తి.. తెలంగాణ శక్తి అని తెలిపారు. మీ తరఫున గొంతెత్తి పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు.