ఖైరతాబాద్, ఆగస్టు 10: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కేంద్ర ప్రభుత్వ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. ఖైరతాబాద్ రైల్వే స్టేసన్ నుంచి రాజ్భవన్కు ర్యాలీగా బయలుదేరిన ఆయా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పశ్యపద్మ మాట్లాడుతూ.. స్వదేశీ, విదేశీ కార్పొరేటర్ సంస్థలకు అనుకూలంగా, రైతులు, కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వ్యతిరేకంగా కేంద్రం విధానాలు ఉన్నాయన్నారు. భారత వ్యవసాయ రంగం నుంచి కార్పోరేట్ సంస్థలు వైదొలగాలని, రైతులు, వ్యవసాయరంగ ప్రయోజనాలను దెబ్బతీసే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బాలరాజ్, ఎండీ యూసుఫ్, ఎం.నర్సింహ,యాదగిరి, మూర్తి, కిషన్, హసీనా బేగం, బోస్, శ్రీనివాస్, పార్వతి, లక్ష్మిబాయి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, వెంకటేశ్, ఐఎన్టీయుసీ నాయకులు.. చంద్రశేఖర్ విజయ్కుమార్, టీయూసీఐ నాయకులు సూర్యం, ఐఎఫ్టీయూ నాయకులు శ్రీనివాస్, అనురాధ, ఎస్కేఎం నాయకులు సాగర్, ప్రభాకర్, భిక్షపతి, వెంకటయ్య, రాము, విజయ్ ప్రసాద్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.