KCR | గిరిజనులు, మారుమూల ప్రాంతాల కోసం పాత ఆదిలాబాద్ జిల్లాలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ను ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని.. కానీ పార్లమెంటు ఎన్నికల తెల్లారే వాటిని రద్దు చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నాడని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలని.. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల జిల్లా కేసీఆర్ తెచ్చిన జిల్లా అని.. ఎన్నో దశాబ్దాల కల అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మనం ఆదిలాబాద్ దారి పట్టాలా? 100, 150 కిలోమీటర్లు నడవాలా? అని స్థానిక ప్రజలను ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా ఉండాలనే వాళ్లు బీఆర్ఎస్కు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా పోయినా ఫర్వాలేదని అనుకునేవాళ్లు బీఆర్ఎస్ను ఓడగొట్టి.. కాంగ్రెస్ను గెలిపించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా కోసం కొట్లాడుదామా? యుద్ధం చేద్దామా? అని ప్రజలను అడిగారు. జరగబోయే బ్యాలెట్ యుద్ధంలో మంచిర్యాల జిల్లా గుండె చీల్చి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు.
గ్రామాలు పోయినయ్.. పట్టణాలు పోయినయ్.. కనీసం స్ట్రీట్లైట్లు పోతే వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు.. కల్యాణలక్ష్మీ చెక్కులు లేవు.. కేసీఆర్ కిట్లు బంద్ చేసిండ్రు.. న్యూట్రీషియన్ కిట్లు బంద్ చేసిండ్రు.. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్ బంద్ చేసిండ్రు.. కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తేవడం లేదు.. ఈ విధంగా ఏ రంగంలో చూసినా కూడా గత 5 నెలలుగా అన్ని పనులు నిలిపివేసిండ్రు అని కేసీఆర్ తెలిపారు. ఇది ఎంత వరకు కరెక్ట్? ఏరకంగా కరెక్ట్? అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజలకు సంబంధించిన మంచి పనులు ఉంటే కొనసాగిస్తారు.. కానీ అన్నింటినీ గుడ్డిగా రద్దు చేయరని స్పష్టం చేశారు. కానీ ఈ మూర్ఖపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా జిల్లాలు రద్దు చేస్తాం.. అన్ని రద్దు చేస్తాం.. కాంప్లెక్స్లను ఆపేస్తాం.. చెన్నూరు లిఫ్ట్ ఆపేస్తాం.. మంచినీళ్ల స్కీమ్ కూడా ఆపేస్తామని అంటూ మూర్ఖంగా ముందుకెళ్తున్నదని మండిపడ్డారు.