ములుగు : నియోజక వర్గంలోని ఆఖరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నా. పోడు భూముల సమస్యను సీఎం కేసీఆర్ తానే స్వయంగా పరిష్కారం చేస్తానని తెలిపారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం పటిష్టం చేయడంలో భాగంగా తాడ్వాయి మండల కేంద్రంలోని హరిత హోటల్లో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
పోడు రైతులకు రైతు బీమా ఇస్తున్నాం. త్వరలోనే పట్టాలు కూడా ఇస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి పటిష్ఠమైన నాయకత్వము ఉంది. సమర్థులైన నాయకులు గ్రామం నుంచి రాష్ట్రం వరకు ఉన్నారు. వీరందరికీ న్యాయం జరిగే విధంగా మేం బాధ్యత తీసుకుంటామన్నారు. మీరంతా సమన్వయంతో పని చేసి పార్టీ పటిష్టం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో సమర్థులకే పట్టం కడుతామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఒక గాలి వీస్తే ఇక్కడ పొరపాటున ఇంకొక గాలి వీచినా..ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసిఆర్ ములుగును జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో నియోజకవర్గానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. బీజేపీ పాపం పెరిగినట్లు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగాయి.
నేను రైల్వే స్టేషన్లో టీ అమ్మాను అన్న ప్రధాని నేడు ఆ రైల్వే స్టేషను అమ్మేస్తున్నారని విమర్శించారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ వంటి గొప్ప ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నియోజక వర్గాల్లో తిరగకుండా ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. టీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ఈ తప్పుడు మాటలను తిప్పి కొట్టాన్నారు.
టీఆర్ఎస్ అంటే కేవలం పార్టీ కాదు తెలంగాణ ప్రజల రక్షణ కవచం అని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కవిత, టి.ఎస్. ఐ. ఐ. సి చైర్మన్ బాలమల్లు, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, వైస్ చైర్మన్ నాగ జ్యోతి, రైతు సమన్వయ సమితి నేత పల్లా బుచ్చయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, టి.ఆర్.ఎస్ నేతలు గోవింద్ నాయక్, ప్రహ్లాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం..వృద్ధురాలికి చేయూత
Ind vs Eng | ఇంగ్లండ్ గెలుస్తుందా? చేజింగ్లో ఆ టీమ్ రికార్డేంటి? ఓవల్ పిచ్ ఎలా ఉంది?
కందకుర్తి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం