లండన్: ఇండియా, ఇంగ్లండ్ ( Ind vs Eng ) మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మంచి రసకందాయంలో పడింది. ఆతిథ్య జట్టు ముందు టీమిండియా 368 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచినా.. ఆ టీమ్ కూడా చేజింగ్ను కాన్ఫిడెంట్గానే మొదలుపెట్టింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో మిగిలింది ఒక్క రోజు. చివరి రోజు ఇంగ్లండ్కు 291 పరుగులు అవసరం కాగా.. ఇండియన్ టీమ్కు 10 వికెట్లు కావాలి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్కు గెలిచే చాన్స్ ఉందా? ఆ టీమ్ ఇప్పటి వరకూ చేజ్ చేసిన అత్యధిక స్కోరెంత? ఓవల్ పిచ్పై ఇంత భారీ స్కోరు చేజ్ చేయడం సాధ్యమేనా అన్న విషయాలు చూద్దాం.
ఇంగ్లండ్ రికార్డు ఇదీ..
ఇప్పటి వరకూ టెస్టుల్లో ఇంగ్లండ్ టీమ్ చేజ్ చేసిన అత్యధిక స్కోరు 362. 2019లో జరిగిన యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాపై ఇంత భారీ స్కోరు చేసి గెలిచింది. ఆ మ్యాచ్లో బెన్ స్టోక్స్ 135 పరుగులు చేసి టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఇప్పుడతడు టీమ్లో లేడు. ఇక ఇదే ఇంగ్లండ్ సొంతగడ్డపై 2001లో ఆస్ట్రేలియాపైనే 315 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రెండు సందర్భాల్లో మాత్రమే ఇంగ్లండ్ 300కుపైగా లక్ష్యాలను ఛేదించగలిగింది. ఆ లెక్కన చూస్తే.. ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలవాలంటే కొత్త రికార్డును సృష్టించాల్సి ఉంటుంది.
ఓవల్ స్టేడియం రికార్డు ఏంటి?
అయితే ఓవల్ గ్రౌండ్లో ఇప్పటి వరకూ 263 పరుగులు చేజ్ చేయడమే అత్యధికం. అది కూడా 1902లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ చేసింది. ఫస్ట్క్లాస్ చరిత్రలో ఈ గ్రౌండ్లో 350కిపైగా స్కోర్లు చేజ్ చేసిన సందర్భాలు కేవలం నాలుగు మాత్రమే. అయితే మ్యాచ్ డ్రా అయిన, లేదంటే చేజింగ్ టీమ్ ఓడిపోయిన సందర్భాల్లో మాత్రం భారీ స్కోర్లు నాలుగో ఇన్నింగ్స్లో నమోదయ్యాయి. 1979లో ఇదే ఓవల్ గ్రౌండ్లో ఇండియన్ టీమే ఇంగ్లండ్పై అత్యధికంగా నాలుగో ఇన్నింగ్స్లో 429 పరుగులు చేసింది. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
గత ఇంగ్లండ్ టూర్లోనూ ఈ ఓవల్లో 464 పరుగుల లక్ష్యంతో దిగిన ఇండియా.. 345 పరుగులు చేయగలిగింది. చివరి పది మ్యాచ్ల రికార్డు చూసుకుంటే.. ఇంగ్లండ్ ఐదు గెలిచి, నాలుగు ఓడిపోయింది. అయితే ప్రస్తుతం ఓవల్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తుండటంతో.. దీనిపై ఈ రికార్డు స్కోరు చేజ్ చేయడం సాధ్యమేనని కొందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు.