ఎల్బీనగర్ చౌరస్తాలో ఆర్టీసీ సేవలను స్వయంగా పరిశీలించిన ఎండీ
హైదరాబాద్ : దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లే వారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణించొద్దని సూచించారు.
ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జిలు కూడా వసూలు చేయడం లేదని తెలిపారు. దసరా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా నడుపుతున్న ప్రత్యేక బస్సు సేవలను వీసీ సజ్జనార్ బుధవారం రాత్రి ఎల్బీనగర్ చౌరస్తాలో స్వయంగా పరిశీలించారు. అక్కడ ఆర్టీసీ సిబ్బంది పనితీరును గమనించి పలు సూచనలు చేశారు. ఆర్టీసీ సిబ్బందికి సహకారం అందిస్తున్న ఎల్బీనగర్ ట్రాఫిక్ సిబ్బందిని సైతం ఆయన అభినందించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తరలిస్తున్న సొంత వాహనాలను(వైట్ నంబర్ప్లేట్ ఉన్నవి)రెండు రోజుల్లో 20 వరకు సీజ్ చేసినట్టు సజ్జనార్ వెల్లడించారు.