హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఆసరా వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. పింఛన్ల అర్హత వయసును తగ్గించాలని ఆదివారం క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. గ్రామ స్థాయిలో దరఖాస్తులు స్వీకరించి అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తారు. పింఛన్ వయసు నిర్ధారణకు ఓటరు జాబితా, ఆధార్కార్డు, ఇతర ఆధారాలను ప్రామాణికంగా తీసుకుంటారు.
రాష్ట్రంలో 37 లక్షల మందికి ఆసరా పింఛన్ నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. మరో ఐదు లక్షలమంది దివ్యాంగులకు నెలకు రూ.3,016 అందజేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ కేవలం రూ.200 ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో దానిని టీఆర్ఎస్ ప్రభుత్వం మొదట రూ.1,000, తర్వాత రూ.2,000కు పెంచింది. కరోనా సంక్షోభంలోనూ పింఛన్లకు ఇబ్బంది లేకుండా నిధులు విడుదల చేసింది. ఆసరా పింఛన్లకు 2019లో రూ.7,427.32 కోట్లు, 2020లో రూ.9,828.33 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఇప్పుడు అర్హత వయసును తగ్గించడంతో పింఛన్లకు ఏటా రూ.12 వేలకోట్ల వరకు అవసరమవుతాయని అంచనా. 2021-22 బడ్జెట్లో పింఛన్లకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, వితంతువులు, ఎయిడ్స్ రోగులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, చేనేత కార్మికులకు కూడా పింఛన్ అందిస్తున్నారు.
వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును తగ్గించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి పంచాయతీరాజ్శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.