జగిత్యాల: వాకిట్లో పచ్చని పందిరి. ఇంటి నిండా బంధువుల హడావిడి. మరో మూడు గంటల్లో పెండ్లి. వరుడి ముఖంలో ఓ ఇంటి వాడిని కాబోతున్నానన్న ఆనందం. తల్లిదండ్రుల్లో ఇంట్లోకి కొత్త కోడలు రాబోతున్నదన్న సంతోషం. బాజాభజంత్రీల చప్పుళ్లు, బంధుమిత్రుల కోలాహలంతో రాత్రంతా సందడిసందడిగా పెండ్లికి ముందు జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 10 గంటలకు పెండ్లి ముహూర్తం ఉండటంతో ఏడు గంటలకు మైలపోలు తంతు నిర్వహిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లో విషాదం నెలకొన్నది. సంతోషంగా కొడుకు మైలపోలు వేడుక చూస్తున్న తండ్రికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. బంధువులు ఆస్పత్రికి తరలిస్తుండానే ప్రాణాలు కోల్పోయాడు. జగిత్యాల జిల్లాలో ఇవాళ ఉదయం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్కు చెందిన గంగారాం (62), రాజేశ్వరి ఇద్దరూ దంపతులు. వారి చిన్న కొడుకు ప్రశాంత్కు ఇటీవల పెండ్లి కుదిరింది. మల్లాపూర్ మండలం దాంరాజ్పల్లికి చెందిన యువతితో అతడి వివాహం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పెండ్లి జరిగేలా ముహూర్తం కూడా నిర్ణయించారు. పెండ్లికి మరో మూడు గంటలు ఉందనగా ఉదయం ఏడు గంటలకు వరుడి తండ్రి గంగారాం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ హఠాత్పరిణామంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. విగతజీవిగా మారిన గంగారాంను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అంతేకాదు, రెండు క్రితం కూడా ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గంగారాం అల్లుడు కూడా గుండెపోటుతోనే మృతిచెందాడు. తన కళ్ల ముందే తన కుమార్తెకు పసుపు కుంకుమలు దూరమయ్యాయన్న బాధ నుంచి తేరుకోకముందే.. రాజేశ్వరి కూడా భర్తను పోగొట్టుకుని దిక్కు తోచని పరిస్థితిలోకి వెళ్లిపోయింది.
ఇవి కూడా చదవండి..