Lovers | ఆమెది పాకిస్తాన్.. అతనిది ఇండియా.. తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్ను అని చెప్పుకున్నాడు. ఆమెనేమో కాలేజీ చదువుతున్నట్లు తెలిపింది. ఇక ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో పాకిస్తాన్ యువతి.. ఇండియాకు వచ్చేందుకు రెండు దేశాలు వెళ్లాల్సి వచ్చింది. మొదటగా కరాచీ నుంచి దుబాయికి, అక్కడ్నుంచి నేపాల్కు చేరుకుంది. నేపాల్ నుంచి భారత్కు వచ్చి తాను ప్రియుడ్ని పెళ్లాడింది.
పాకిస్తాన్కు చెందిన 16 ఏండ్ల ఇక్రా కాలేజీ చదువుతోంది. అయితే ఆమె లూడో గేమ్ ఆడుతుండగా, భారత్కు చెందిన ములాయం సింగ్ యాదవ్(26) పరిచయం అయ్యాడు. అయితే యాదవ్ తన పేరును సమీర్ అన్సారీగా చెప్పుకున్నాడు. తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్ను అని నమ్మబలికాడు. ఇక పాక్ యువతి అతని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
ఇక భారత్కు వచ్చేందుకు ఇక్రా తన వద్ద ఉన్న నగలను అమ్మేసింది. ఫ్రెండ్స్ వద్ద కొంత డబ్బు సేకరించింది. నగలు అమ్మగా వచ్చిన డబ్బు, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో దుబాయికి వెళ్లింది. అక్కడ్నుంచి నేపాల్కు చేరుకుంది. ములాయం కూడా నేపాల్కు వెళ్లాడు. ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి యాదవ్.. బెంగళూరుకు ఆమెను తీసుకొచ్చాడు. అయితే అతను ముస్లిం కాదని, హిందువు అని తేలిపోయింది. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లు ఇక్రాకు తెలిసింది. అయినప్పటికీ అతని ప్రేమకు ఫిదా అయిన ఇక్రా.. అతనితోనే ఉండేందుకు సిద్ధమైంది.
అయితే ఇటీవల యాదవ్ తన సొంతూరైన ఉత్తరప్రదేశ్కు తీసుకొచ్చాడు. ఇక్రా యాదవ్ ఇంట్లో ప్రార్థనలు చేస్తుండగా స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఇక్రా, యాదవ్ను విచారిచంగా జరిగిన విషయం చెప్పారు. మొత్తంగా ఇక్రాను వారి కుటుంబ సభ్యులకు భారత అధికారులు వాఘా సరిహద్దులో అప్పగించారు. యాదవ్ను జైలుకు తరలించారు.