సత్తుపల్లి టౌన్, జూలై 25 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో వైద్యరంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లికి బీఎస్సీ నర్సింగ్ కళాశాలను మంజూరు చేయడంతో పాటు రూ.25కోట్లు నిధులు విడుదల చేయడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యరంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీఠ వేస్తున్నారని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో టీమెడికల్ హబ్ ఏర్పాటు చేయడం, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి మెరుగైన వైద్యాన్ని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో నిరుపేద విద్యార్థులకు వైద్యవిద్యను అందుబాటులోకి తీసుకురావాలని వైద్య కళాశాలతో పాటు బీఎస్సీ నర్సింగ్ కళాశాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయిస్తున్నారని చెప్పారు. బీఎస్సీ నర్సింగ్ కళాశాల తరగతులు 2023 అక్టోబర్ నాటికి ప్రారంభించేలా కృషిచేస్తానని అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ వైద్యశాలల్లో నర్సింగ్ వ్యవస్థ మొత్తం కేరళ రాష్ర్టానికి చెందిన యువతులు పెద్ద ఎత్తున ఉన్నారని, సత్తుపల్లి లాంటి మారుమూల ప్రాంతానికి బీఎస్సీ నర్సింగ్ వైద్యరంగంలో అవకాశం వస్తుందని చెప్పారు.
విమర్శకులు విమర్శలు చేయడం చాలా తేలిక…అభివృద్ధి ఫలాలను తీసుకురావడం చాలా కష్టతరమని అన్నారు. 2022 వరకు ఎంతో గొప్పగా అభివృద్ధి రాష్ట్రంగా కనబడుతున్నా తెలంగాణ నేడు విమర్శ చేస్తున్న పొంగులేటికి ఇప్పుడు ఎలా అభివృద్ధి జరగలేదని చెబుతున్నారని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, వేంసూరు, తల్లాడ మండలాలకు రూ.34.14కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రోడ్లు మంజూరయ్యాయని, వాటిని త్వరలో ప్రారంభించి పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, సత్తుపల్లి, పెనుబల్లి ఎంపీపీలు దొడ్డా హైమావతి, లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఆత్మచైర్మన్ వనమా వాసు, డీసీసీబీ డైరెక్టర్లు చల్లగుళ్ల కృష్ణయ్య, మోదుగు పుల్లారావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రఫీ, మల్లూరు అంకమరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.