జమ్మికుంట : గ్రామీణ గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతోనే గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ నాలుగేళ్ల క్రితం ప్రారంభించినట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని దినేష్ కన్వెన్షన్ హాల్లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి విడతలో రాష్ట్రంలో 40 లక్షల గొర్రె పిల్లల్ని గొల్ల కుర్మలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. వాటితో మరో 40 లక్షల సంతతి పెరిగిందన్నారు. గొల్ల కురుమలను ప్రభుత్వం ఆదుకుంటూ అండగా నిలుస్తుందన్నారు. ప్రతి గ్రామంలో గొల్ల కురుమల కుటుంబాలు 100 నుండి 150 వరకు ఉంటాయని, వారందరికీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కులవృత్తులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ క్రమంలో భాగంగానే సీఎం గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని, అలాగే రెండో విడత గొర్రెల పంపిణి కార్యక్రమం కూడా విజయవంతంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్, శాసనమండలి సభ్యులు మల్లేశం యాదవ్, బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు సుంకే రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, హుజురాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ నరేందర్, యాదవ కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.