హైదరాబాద్: కృష్ణానదీ జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. జూరాల నుంచి పులిచింతల వరకు డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాల పహారాలో ఉన్నాయి. ఇందులో భాగంగా జూరాల ఆనకట్టపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. జలాశయం, జలవిద్యుత్ కేంద్రం వద్ద పోలీసులు మోహరించారు. శ్రీశైలం జలాశయం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసు భద్రతను పెంచాయి. ఎడమగట్టున ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద వాహణాలను తనిఖీ చేస్తున్నారు. ఇక నాగార్జునసాగర్ జలాశయం వద్ద మూడో రోజు పోలీసు బందోబస్తు కొనసాగుతున్నది. ఉద్యోగులు మినహా పవర్హౌస్లోకి ఎవరినీ అనుమతించడంలేదు. సాగర్ డ్యాంపై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రిడ్జి వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పులిచింతల జలాశయం వద్ద కూడా బందోబస్తు కొనసాగుతున్నది.