Ujjaini Mahankali Temple | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి(రంగం) వినిపించారు. మీరెవరూ నేను చెప్పింది ఏదీ ఆచరించడం లేదంటూ మాతంగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడకు నేను సంతోషంగా రాలేదు.. క్రోధంతో వచ్చానని అన్నారు. మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని నిలదీశారు. నా విగ్రహం ప్రతిష్ట చేస్తానని మాట ఇచ్చి జరిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ ఆపద వచ్చినా.. ప్రమాదం వచ్చినా కాపాడుతున్నానని మాతంగి స్వర్ణలత తెలిపారు. కానీ మీరు చేసే చర్యలే నాకు ఆగ్రహం తెప్పిస్తుందని అన్నారు. వావివరసలు లేకుండా ఘోరాలు జరుగుతున్నాయని.. అలాంటి వారిని వదిలిపెట్టనని అన్నారు. వారిని పాదాల కింద నలిపేస్తానని అన్నారు. ఈ ఏడాది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాతంగి భవిష్యవాణిలో చెప్పారు.ఈ ఏడాది కుంభవర్షాలు ఉన్నాయని తెలిపారు. అగ్నిప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది ప్రాణనష్టం భారీగా జరుగుతుందని అన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కొంతమంది కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారని మాతంగి స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రవర్తన తనకు సంతోషం కలిగించడం లేదని తెలిపారు. విగ్రహ ప్రతిష్ట చేయిస్తానని మాట ఇచ్చారని.. కానీ మాట నిలబెట్టుకోవడం లేదని అన్నారు. విగ్రహ ప్రతిష్టకు ఎవరు అడ్డువచ్చినా ఊరుకోనని హెచ్చరించారు.