Rajamouli | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి పై మరో ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్లో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చినప్పటికీ, ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని రాజమౌళి తొలిసారి వెల్లడించారు. తాజాగా ఫ్రాన్స్కు చెందిన ఓ ప్రముఖ సినీ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ, ‘వారణాసి’ కథలోని కొన్ని విజువల్ ఎలిమెంట్స్ సాధారణ స్క్రీన్పై చూపించడం కంటే ఐమాక్స్లోనే ప్రేక్షకులకు పూర్తి అనుభూతిని అందిస్తాయని తెలిపారు. అందుకే ఈ ప్రాజెక్ట్ను ఐమాక్స్ సాంకేతికతతో రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
సినిమాలో ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించారు. ముఖ్యంగా అంటార్కిటికాలోని దాదాపు 300 అడుగుల ఎత్తైన మంచు కొండలు, మంచుతో కప్పుకున్న విశాలమైన ప్రాంతాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని తెలిపారు. ఈ సన్నివేశాలు ఐమాక్స్ స్క్రీన్పై మరింత గొప్పగా కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, సినిమాలో రామాయణ ఇతిహాసానికి సంబంధించిన వానర సేనల ఆధారంగా రూపొందించిన భారీ యుద్ధ సన్నివేశాలు కూడా కీలక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. వేలాది మంది యోధులు, భారీ యాక్షన్ విజువల్స్తో రూపొందించిన ఈ ఎపిసోడ్ను ప్రేక్షకులు నిజంగా ఆ ప్రపంచంలోకి వెళ్లినట్టుగా అనుభూతి చెందాలంటే ఐమాక్స్ ఫార్మాట్ అవసరమని రాజమౌళి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్ చివరి దశలో కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రీకరణలో ఎక్కువ భాగం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన కీలక సన్నివేశాలను పూర్తి చేసిన అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయనున్నారు. చిత్ర షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తైందన్నారు జక్కన్న.చిత్రీకరణ పూర్తి కాగానే ఎడిటింగ్ ప్రక్రియ సమాంతరంగా మొదలుపెడతామని చెప్పుకొచ్చారు. పూర్తైన సన్నివేశాలని ఎప్పటికప్పుడు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విభాగాలకి పంపిస్తూ పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం కృషి చేస్తోంది.