Telangana | పర్యావరణ పరిరక్షణ.. పుడమికి పచ్చదనం.. దొబ్బాల ప్రకాశ్కు రెండు బాధ్యతలూ రెండు కండ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల ఆయన స్వగ్రామం. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు. అడవిని సృష్టించాలన్నది ఆశయం. ఆ లక్ష్యం కోసమే.. ఏటా వానకాలంలో చెట్ల కింద రాలిపడ్డ విత్తనాలను సేకరిస్తూ, విత్తన బంతులు తయారుచేస్తాడు. ఇప్పటివరకు 18లక్షల విత్తన బంతులు ప్రకృతిలో వెదజల్లాడు. లాక్డౌన్ సమయంలో సైతం రెండు లక్షల విత్తన బంతులు అడవితల్లికి కానుకగా అందించాడు. ఈ ఏడాది ప్రత్యేకించి.. సీతాఫలం విత్తన బంతులు సిద్ధం చేస్తున్నాడు. అంతేకాదు, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు పేపర్ బ్యాగులుతయారుచేసి ఉచితంగా అందిస్తున్నాడు. ఎనిమిదేండ్లుగా ప్రకృతి కోసం పరితపిస్తూ ప్రకృతినే ఇంటిపేరుగా మార్చుకుని ‘ప్రకృతి ప్రకాశ్’గా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయాడు దొబ్బాల ప్రకాశ్.
ప్రకాశ్కు బాల్యం నుంచీ ప్రకృతి అంటే ప్రేమ. పద్మశ్రీ వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకున్నాడు. రోడ్ల వెంబడి, చెట్ల కింద రాలిపడ్డ పద్దెనిమిది లక్షల విత్తనాలను ఏరి.. విత్తన బంతులను తయారు చేశాడు. ప్రకృతిని కాపాడుకోవాలన్న మంత్రి కేటీఆర్, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ పిలుపు తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని చెబుతాడు. మొక్కలు నాటడం, వాటిని పంపిణీ చేయడం కోసం సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేశాడు. అడవిని విడిచి పల్లె బాట పట్టిన కోతుల బెడదతో రైతులు పడుతున్న ఇబ్బందులకు కదిలిపోయి, కరిగిపోయి అటవీ ప్రాంతాల్లో జామ, అల్లనేరేడు, సపోటా, మామిడి మొక్కలు నాటాడు. వేసవిలో
ఆకలితో అలమటించే వానరాలకు ఎనిమిదేండ్లుగా ఆహారాన్ని అందిస్తున్నాడు.
ప్రకృతి విలువ తెలుసుకున్న ప్రకాశ్ కుటుంబం మొత్తం ప్రకృతి ప్రేమికులుగా మారింది. ఇంటిల్లి పాదీ వేసవిలో చెట్ల కింద రాలిపడ్డ విత్తనాలను సేకరించి విత్తన బంతులు తయారు చేస్తారు. లాక్డౌన్లో కూడా ప్రకాశ్, ఆయన భార్య మమత, కుమారుడు జాన్సన్, కూతురు బ్లెస్సీ తలో చేయి వేసి లక్ష విత్తన బంతులను తయారుచేశారు. అందులోనూ బ్లెస్సీ.. తండ్రి నిబద్ధత పట్ల ఆకర్షితురాలై, తను కూడా 65 వేల విత్తనాలను సేకరించింది. వాటిని విత్తన బంతులుగా మార్చి తన పుట్టిన రోజున తండ్రి సాయంతో అడవిలో వెదజల్లింది.
ప్రకాశ్ అండ్ ఫ్యామిలీ ఎనిమిదేండ్లుగా 18 లక్షల విత్తన బంతులు తయారుచేసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన భూపుత్ర ఫౌండేషన్ సహకారంతో డ్రోన్ ద్వారా అటవీ ప్రాంతాల్లో వెదజల్లింది. రుద్రంగి మండలం మానాల, చందుర్తి మండలం లింగంపేట, వీర్నపల్లి మండలం గర్జనపల్లి, కోనరావుపేట మండలం నిమ్మపల్లి, మరిమడ్ల, శివంగాళపల్లి, మల్కపేట రిజర్వాయర్ గుట్టప్రాంతం, ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి అటవీ ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా విత్తనాలు విసిరారు. హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టిన ప్రకాశ్, తన బైక్కు మైక్ కట్టి ఆరేండ్లుగా ఊరూరా ప్రచారం నిర్వహిస్తున్నాడు. హరితహారంపై పాటలు రాసి సీడీలను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశాడు. ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దామోదర్ రావు కూడా ప్రకాశ్ సేవలను మెచ్చుకున్నారు.
ప్రకాశ్ ఏటా వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీరుస్తున్నాడు. సిరిసిల్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికుల దాహం తీర్చేందుకు రోజుకు 150 కూల్ వాటర్ బబుల్స్ సమకూర్చుతున్నాడు. గత ఏడాది
నేలకొరిగిన 100 ఏండ్ల మర్రి చెట్టుకు సైతం మూడు నెలల పాటు ట్రాక్టర్ ద్వారా నీళ్లు పోసి జీవం పోశాడు. హైదరాబాద్ నుంచి భారీ క్రేన్ తెప్పించి తిరిగి నాటించి ప్రాణం పోశాడు.‘ఒక చెట్టును బతికించడం వంద చెట్లను నాటడంతో సమానం’ అంటాడు ప్రకాశ్. రేపటి తరానికి పచ్చనోట్లను కాకుండా.. పచ్చని సంపదను వారసత్వంగా అందించినప్పుడే.. మనం బాధ్యత కలిగిన తల్లిదండ్రులం అవుతాం!
సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన హరితహారంతో ప్రకృతి పులకరిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పల్లెల్లో, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాను. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్, వనజీవి రామయ్య స్ఫూర్తితో జిల్లాలో ఎనిమిదేండ్ల నుంచి విత్తనాలు సేకరించి విత్తన బంతులు తయారుచేస్తున్నా. కుటుంబసభ్యులమంతా కలిసి ఇప్పటికే 18 లక్షల వరకు విత్తన బంతులను అడవులలో విసిరేశాం. కోతుల బెడదతో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కల విత్తన బంతులను వెదజల్లుతున్నా. భూమాత రుణం తీర్చుకుంటున్నా. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటేలా కృషి చేస్తున్నా.
– దొబ్బాల ప్రకాశ్, సుద్దాల (కోనరావుపేట)
…?సాసాల గంగాధర్
“Hemanth Kumar | అతను చేసే సాయానికి పబ్లిసిటీ అక్కర్లేదు.. ఎదుటివాళ్ల మొహంలో చిరునవ్వు చూస్తే చాలు!”