Lucky Bisht | గూఢచారుల సాహసాలు తెలుసుకోవాలంటే.. లక్కీ బిస్త్ అలియాస్ లక్ష్మణ్సింగ్ జీవిత కథ చదవాల్సిందే. మనల్ని హాలీవుడ్ సినిమాల్లోని గూఢచారులు ఆకట్టుకున్నట్టే, భారతీయ గూఢచారి లక్కీ జీవితం ఓ అమెరికన్ ప్రచురణ సంస్థను ఆకర్షించింది. సచిన్ టెండూల్కర్ తర్వాత, ఆ సంస్థ ప్రచురించిన భారతీయుడి జీవిత చరిత్ర ఇదే.
సెప్టెంబర్ 5, 2011 అర్ధరాత్రి. జంట హత్యలు. నిందితుడు పరార్. ఉత్తరాఖండ్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ హత్యలతో సంబంధం ఉందనే కారణంతో రా ఏజెంట్ లక్కీ బిస్త్ అలియాస్ లక్ష్మణ్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను నిర్దోషినని ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. నిర్దాక్షిణ్యంగా కటకటాల వెనుక నెట్టేశారు. ఇంతకీ ఎవరీ లక్కీ? అంటారా. అదో థ్రిల్లర్ వెబ్సిరీస్ను తలపించే కథ. ‘ఉత్తమ కమాండో 2009’ అవార్డు అందుకున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండో లక్కీ బిస్త్ జీవితం నిండా అనేక మలుపులు. లిమా అలియాస్ లక్కీ బిస్త్ ఉత్తరాఖండ్లో పుట్టాడు. సైనిక కుటుంబం. లక్కీ వాళ్ల తాత 1971 భారత-పాక్ యుద్ధంలో వీరమరణం పొందాడు. తండ్రి స్ఫూర్తితో లక్కీ వాళ్ల నాన్నా సైన్యంలో చేరాడు. మూడోతరంలో లక్కీ కూడా సైన్యానికి ఎంపికయ్యాడు. ఇండియన్ ఆర్మీ, స్పెషల్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్లో విధులు నిర్వర్తిస్తూ .. 2004 నుంచి కాంగో, సోమాలియా, బంగ్లాదేశ్, శ్రీలంక శాంతి పరిరక్షణ దళాల్లోనూ సభ్యుడిగా ఉన్నాడు. భారత దేశానికి తిరిగొచ్చాక అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, అకాలీదళ్ ప్రముఖుడు ప్రకాశ్ సింగ్ బాదల్ వంటి ప్రముఖులకు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధులు నిర్వర్తించాడు. బరాక్ ఒబామా భారత పర్యటనకు వచ్చినపుడు ఆయన రక్షణ బాధ్యతల్లో పాలుపంచుకున్నాడు.
‘ఒకే చోట ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ప్రపంచమంతా తిరుగుతూ పని చేయాలని నా కోరిక’ అని అధికారులను కోరాడు లక్కీ. దీంతో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)కు బదిలీ చేశారు. అప్పటి నుంచి తన జీవితం నిండా మెరుపులే. ప్రతి సాహసం అతని జీవితాన్ని తీర్చిదిద్దింది. ఓసారి, నేపాల్ సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశించే అక్రమ ఆయుధాల గుట్టు విప్పే బాధ్యత లక్కీకి అప్పగించారు. లిమా అనే మారుపేరుతో లక్కీ ఉత్తరాఖండ్ – నేపాల్ సరిహద్దుల్లో అడుగుపెట్టాడు. ఆయుధ వ్యాపారులతో సంబంధాలు ఉన్న వాళ్లను గుర్తించాడు. నిఘా పెంచి ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం అందించేవాడు. ఆ రోజుల్లోనే రాజు, అమిత్ అనే ఇద్దరు దుండగుల హత్య జరిగింది. లక్కీని జైల్లో పెట్టారు. నాలుగేండ్లపాటు జరిగిన విచారణలో 11 జైళ్లకు మార్చారు. హతులిద్దరూ నేపాల్ పార్లమెంట్ సభ్యుడైన మీర్జా దిల్షాద్ బేగ్ మనుషులు. దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలు ఉండేవి. హత్యకు సంబంధించి ఏ ఆధారాలూ లేకపోవడంతో నిరపరాధిగా భావించి లక్కీని విడుదల చేసింది కోర్టు. 2018లో జైలు నుంచి విడుదలయ్యాడు.
అక్కడితో ఆగిపోలేదు. లక్కీ సాహసాలు మళ్లీ మొదలయ్యాయి. సినిమా రంగంలో అడుగుపెట్టాడు. మ్యూజిక్ ఆల్బమ్ నిర్మించాడు. వాటితోపాటు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ తీశాడు. తన సొంత బ్యానర్పై ఓ ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నాడు. దీనికి మాటల రచయిత కూడా తనే. ఆ సాహస యాత్రే రచయిత ఎస్. హుస్సేన్ జైదీని ఆకట్టుకుంది. లక్కీని ఇంటర్వ్యూ చేసి జీవిత చరిత్ర రచనకు పూనుకున్నాడు. సైమన్ అండ్ షూస్టర్స్
ప్రచురణ సంస్థ ఆ పుస్తకాన్ని ప్రచురించేందుకు ముందుకు వచ్చింది. సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ సంస్థ ప్రచురించిన రెండో భారతీయుడి జీవిత చరిత్ర ఇదే.
లక్కీ జీవితంలోని ఎత్తుపల్లాలన్నీ ‘రా హిట్మాన్’ పుస్తకంలో వివరించాడు రచయిత జైదీ. ‘సామాన్యులకు, విజేతలకు.. పనితీరు విషయంలోనే కాదు, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడంలోనూ తేడాలుంటాయి’ అని వివరిస్తాడు లక్కీ. తన తల్లి మాత్రం ఈ పుస్తకం చదవకూడదని కోరుతున్నాడు తను. ‘ఈ భూమి మీద ఏ ఒక్కరికీ ఒకే ఆత్మ ఉండదు. తనవాళ్ల ఆత్మ కూడా ఉంటుంది. నాలో మా అమ్మ ఆత్మ ఉంది. నాకు నొప్పి కలిగిందని తెలిస్తే ఆమె బాధపడుతుంది. గూఢచారిగా అతి రహస్యంగా నా కార్యకలాపాలు సాగించాను. ప్రాణాలకు తెగించాను. ప్రమాదాలు ఎదుర్కొన్నాను. ఆ కష్టాలన్నీ అమ్మకు తెలియకుండా దాచాను. అమ్మ మనసు బాధపడకూడదు. అందుకే, నా జీవిత కథ ఆమె చదవకూడదని నా కోరిక’ అంటున్నాడు లక్కీ బిస్త్.
Ameen Khwaja | చెప్పులు కుట్టే స్థాయి నుంచి ఎలక్ట్రానిక్స్ రంగంలో కింగ్లా మారాడు!”
“Flyrobe | ఫ్యాషన్ డబ్బున్నోళ్ల సొత్తు కాదు.. ఇదే ఈమె సక్సెస్ఫుల్ బిజినెస్ వెనుక ఉన్న నినాదం”