KCR | పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులను సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారని తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ యశోద ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులకు కేసీఆర్ మనోధైర్యాన్ని అందించారు. ‘ఏం జేస్తరో చేయండి..మా పెద్దిని కాపాడండి..’ అని కేసీఆర్ ఈ సందర్భంగా వైద్యులకు చేతులెత్తి నమస్కరించారు. దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి.. గుండె చెదురొద్దు ధైర్యంగా ఉండండని పెద్ది భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి అక్కడ పెద్దికి అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. దాదాపు అరగంట సేపు అక్కడే నిలుచుని డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరును గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు.
మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం..
కాగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యున్నత చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు. గుండె ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్ని పని చేస్తున్నాయని.. కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని.. అందుకు మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదని డాక్టర్లు వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి : కేసీఆర్
ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఐసీయూలో వైద్య చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్న కేసీఆర్, వారికి భరోసాను, ధైర్యాన్ని అందించారు. డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటాడని కేసీఆర్ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆందోళన చెందవద్దని భార్యాపిల్లలకు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి గుండె ధైర్యం నింపారు. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు.
దాదాపు 45 నిమిషాల పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అమెరికా తదితర విదేశాల నుంచి డాక్టర్లతో మాట్లాడుతూ.. అవసరమైన సలహాలు తీసుకుంటూ, అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యవస్థలతో, సీనియర్ డాక్టర్లతో చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఎంఆర్ఐ తదితర అవసరమైన పరీక్షలు చేస్తూ, డాక్టర్ల బృందం చేత సమావేశాలు నిర్వహించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే దిశగా అత్యున్నత చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని.. దవాఖాన డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండి ఏఎస్ రావు జెఎస్ రావు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ట, అన్నలు శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి, చెల్లె స్వాతి తదితరులతో మాట్లాడిన కేసీఆర్ వారిలో ధైర్యాన్ని భరోసాను నింపారు.
కేసీఆర్తో పార్టీ ముఖ్యులు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్,పద్మారావు గౌడ్,
వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పార్టీ నాయకులు గ్యాదరి బాలమల్లు, సతీష్ రెడ్డి, రజిని సాయి చంద్, పల్లె రవికుమార్, రాజాం యాదవ్, వాసుదేవరెడ్డి, గజ్జెల నగేష్, చిరుమల్ల రాకేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.
♦️ ఎంజేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి
– వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు♦️ దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండండి
– పెద్ది భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్ గారు.… pic.twitter.com/T5iJ9ooiAF— BRS Party (@BRSparty) July 27, 2026