Nitin Gadkari : తన పేరును ఈ20 పెట్రోల్ (E20 Ethenol) కార్యక్రమంతో ముడిపెడుతూ సోషల్ మీడియా (Social Media) లో ప్రచారమైన పోస్టులు, డీప్ఫేక్ వీడియోలపై కేంద్రమంత్రి (Union Minister) నితిన్ గడ్కరీ (Nitin Gadkari) న్యాయపోరాటానికి దిగారు. తనతోపాటు కుటుంబసభ్యులు ఈ20 విధానంవల్ల లబ్ధిపొందినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court) ను ఆశ్రయించారు.
ఈ వ్యవహారంపై మెటాతోపాటు ఇతర సోషల్ మీడియా వేదికలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ దావా వేయడానికి హైకోర్టు అనుమతిచ్చింది. ఈ20 ఇథనాల్ కార్యక్రమంవల్ల తన కుటుంబం లాభపడిందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ అమలు చేస్తోందని వివరించారు.
ఈ పోస్టులు డీప్ఫేక్ కంటెంట్ ముంబైలో కూడా అందుబాటులో ఉండటంతో బాంబే హైకోర్టుకు ఈ కేసును విచారించే అధికారం ఉందని గడ్కరీ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న జస్టిస్ అభయ్ అహుజా.. సివిల్ సూట్ దాఖలు చేసేందుకు అనుమతి మంజూరు చేశారు. ఈ పరిణామానికి రెండు వారాలముందు నాగ్పూర్లోనూ ఇదే అంశంపై కేసు నమోదైంది. ఈ20 కార్యక్రమానికి సంబంధించి కేంద్రమంత్రిపై తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో నలుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వారిలో యూట్యూబర్, రాజకీయ నాయకుడు మనీష్ కశ్యప్తోపాటు ‘దేశీ బాయ్స్’ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతా.. హర్షిత్ రాఠీ పేర్లు ఉన్నాయి. ఈ20 ఇంధన విధానంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్తో కూడిన ఈ ఇంధనం అనుకూల వాహనాలకు సురక్షితమేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే పాత వాహనాల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.