Belawadi Mallamma | పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ పై మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, మహా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా హీరోయిన్ ఎంపికకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.ఈ సినిమాలో బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆమె చరిత్రలో తన ధైర్యసాహసాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన బేలవాడి మల్లమ్మ పాత్రను పోషించనుంది. శౌర్యం, త్యాగం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ పాత్ర సినిమాలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుందని సమాచారం.
భూమి పెడ్నేకర్ ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు తొలిసారి ఇలాంటి చారిత్రక యోధురాలి పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి, ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. శివాజీ మహారాజ్ వ్యక్తిత్వం, యుద్ధ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలను తెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించేందుకు మేకర్స్ భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కథ, విజువల్ డిజైన్, యుద్ధ సన్నివేశాలు, సెట్ల రూపకల్పన వంటి అంశాలపై చిత్రబృందం చాలా కాలంగా కసరత్తు చేస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్ కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. వీరి పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. అయితే చారిత్రక నేపథ్యానికి తగ్గట్టుగా ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కథను ప్రముఖ రచయిత రిషి విర్మాని అందిస్తుండగా, సంగీత బాధ్యతలను జాతీయ అవార్డు గ్రహీత అమిత్ త్రివేది నిర్వహిస్తున్నారు. చారిత్రక చిత్రానికి తగ్గట్టుగా శక్తివంతమైన నేపథ్య సంగీతం, భావోద్వేగభరితమైన పాటలను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2028లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.