ములుగు : యునెస్కో గుర్తింపు నేపథ్యంలో రామప్ప ఆలయ అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు రచించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలో కొలువైన రుద్రేశ్వర స్వామి దేవాలయం రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) మంగళవారం శ్రీ రుద్రేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప దేవాలయం పరిశీలన అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వేల సంవత్సరాల నుండి ఉన్న వారసత్వ చరిత్ర గల ఈ ప్రాంతం తెలంగాణ వచ్చేంత వరకు గుర్తింపు రాలేదన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు ఈ ఖ్యాతిని కల్పించారని కొనియాడారు. ఎన్నో పథకాలకు మన రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి తెలంగాణ ప్రతిష్టకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం మనకు గర్వకారణమన్నారు. 21 దేశాలు రామప్పకు యునెస్కో గుర్తింపునకు మద్దతు ఇచ్చాయన్నారు. దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జలవనరుల సంఘం చైర్మన్ వి. ప్రకాశరావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్, టూరిజం సెక్రటరీ శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, జిల్లా రెవిన్యూ అధికారిణి రమాదేవి, స్థానిక సర్పంచ్ రజిత, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, రామప్ప ఈవో బిల్లా శ్రీనివాస్, తహసీల్దార్ మంజుల, తదితరులు పాల్గొన్నారు.