Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైంది. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించింది. బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ.. చివరికి ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టంకట్టారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉప ఎన్నిక (by elections)కు ఛాన్స్ ఇవ్వకపోవడం విశేషం.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ (KCR) ప్రతి ఎన్నికల్లోనూ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతుంటారన్న విషయం తెలిసిందే. ఈసారి గజ్వేల్తోపాటూ కామారెడ్డిలోనూ పోటీకి దిగారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం తాను పోటీ చేసే కొడంగల్ నియోజకవర్గంతోపాటు.. కామారెడ్డిలో కేసీఆర్పై పోటీ చేశాడు. అయితే గజ్వేల్లో కేసీఆర్, కొడంగల్లో రేవంత్ గెలుపొందినప్పటికీ.. కామారెడ్డిలో మాత్రం ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
ఒక వేళ తమ సొంత నియోజకవర్గంతోపాటు కామారెడ్డిలో కూడా ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుపొంది ఉంటే ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉండేది. అయితే ప్రజలు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడ ఇద్దరికీ వ్యతిరేకంగా ఓటు వేసి.. ఉప ఎన్నిక అవసరం లేకుండా చేశారు.
బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్తోపాటు గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేశారు. అయితే రెండు చోట్లా ఆయన ఓటమి చవిచూశారు. సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్లో ఆయన పట్టు కోల్పోవడం గమనార్హం. ఇక గజ్వేల్లో కేసీఆర్ చేతిలో ఘోర పరాభవం పాలయ్యారు. ఈ రెండు చోట్లా ఈటల గెలిచి ఉంటే ఒక స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండేది.
Also Read..
Telangana Assembly Elections | ఫ్యామిలీ పాలిటిక్స్లో సరికొత్త ట్విస్ట్లు..
Telangana Assembly Elections | తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నది వీరే..
Telangana Assembly Elections | ఓడిన ఆరుగురు మంత్రులు.. ఎవరెవరంటే..?