Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ పాలిటిక్స్లో సరికొత్త ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి. ఒకే కుటుంబం నుంచి బరిలోకి దిగిన కొందరు జయకేతనం ఎగురవేయగా.. మరొకొందరికి ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు.
కల్వకుంట్ల ఫ్యామిలీ.. తండ్రి, కుమారుడు, మేనల్లుడు
భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి బరిలోకి దిగిన ముగ్గురు అభ్యర్థులు గెలిచారు. గజ్వేల్లో సీఎం కేసీఆర్ గెలుపొందారు. ఇక సిరిసిల్లలో బరిలోకి దిగిన కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రత్యర్థిపై 30 వేల మెజారిటీతో గెలిచారు. ఇక కేసీఆర్ మేనల్లుడు హరీశ్రావు సైతం సిద్దిపేటలో భారీ మెజారిటీతో గెలుపొందారు.
భార్యా, భర్త గెలుపు
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఇద్దరూ బరిలో దిగారు. వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా.. ఇద్దరూ గెలుపొందారు. హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందగా.. కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి విజయం సాధించారు.
కోమటి రెడ్డి సోదరుల ఘన విజయం
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములూ తాజా ఎన్నికల్లో గెలుపొందారు. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించగా.. వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి గెలుపొందారు.
కుమారుడి గెలుపు, తండ్రి ఓటమి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన మైనంపల్లి కుటుంబానికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో తండ్రీ కొడుకులు బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, మైనంపల్లి హన్మంతరావు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయగా అక్కడ ఆయన ఓటమి చవిచూశారు. ఇక ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్ మాత్రం మెదక్లో గెలుపొందారు.
గడ్డం సోదరుల ఘన విజయం
ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన గడ్డం సోదరులు ఘన విజయం సాధించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వినోద్ గెలుపొందగా.. చెన్నూర్ నియోజకవర్గంలో గడ్డం వివేక్ జయకేతనం ఎగురవేశారు.
మామ, అల్లుడి విజయం
బీఆర్ఎస్ పార్టీనుంచి బరిలోకి దిగిన మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. మల్లారెడ్డి మేడ్చల్ నుంచి గెలుపొందగా.. ఆయన అల్లుడు మల్కాజ్గిరి నుంచి విజయం సాధించారు.