Bhogapuram Airport | భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. జీఎంఆర్ సంస్థ నిర్మించిన ఈ విమానాశ్రయంలో సోమవారం నుంచి దేశీయ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి స్కూట్ ఎయిర్లైన్స్ విమానం సింగపూర్కు బయల్దేరడంతో సేవలు ప్రారంభమయ్యాయి.
సోమవారం ఉదయం 6.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం భోగాపురం చేరుకుంది. విమానాశ్రయ అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు ప్రయాణికులకు స్వాగతం పలికారు. వారికి ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందించారు. అనంతరం హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ తదితర ప్రాంతాలకు విమానాలు బయల్దేరాయి.
భోగాపురం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్కతా, ముంబయి నగరాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి. ఎయిర్ఇండియా, స్కూట్ ఎయిర్లైన్స్ ద్వారా సింగపూర్కు, ఇండిగో ద్వారా అబుధాబికి కూడా విమాన సదుపాయం అందుబాటులో ఉంటుంది. సోమవారం మొత్తం 31 సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకల కోసం 20 విద్యుత్ బస్సులను ఏర్పాటు చేశారు.
భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం కావడంతో విశాఖ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి 10.45 గంటలకు దిల్లీకి చివరి విమానం బయల్దేరింది. విశాఖ విమానాశ్రయంలో ఇప్పటివరకు పనిచేస్తున్న సుమారు వెయ్యి మంది సిబ్బంది భవిష్యత్తులో ఎక్కడ సేవలందిస్తారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.