నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పల తండాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికుల వివరాల ప్రకారం.. బొరుసుగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పల తండాకు చెందిన కేతావత్ చిట్టెమ్మ (46) లట్టుపల్లి గ్రామ సమీపంలోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. రోజువారీగా ఆదివారం కూడా పనికి వెళ్లిన ఆమె.. తిరిగి ఇంటికి వచ్చి నిద్రించింది.
సోమవారం ఉదయం ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా చిట్టెమ్మ మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
చిట్టెమ్మ భర్త జుంపాలియా కూడా మూడేళ్ల క్రితం బావిలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై ఎస్సై శంషాద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.