హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలపై బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మద్రోహం అని మోత్కుపల్లి మండిపడ్డారు. దళితుల భూములు కబ్జా చేసిన ఈటల ఆత్మగౌరవం కోసం తన పోరాటం అని వ్యాఖ్యానించడం సిగ్గు పడాల్సిన విషయమని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. వందల ఎకరాలు కబ్జా చేసి, వేల కోట్ల రూపాయాలు సంపాదించుకునేందుకు ఈటల రాజేందర్కు అవకాశమిచ్చినందుకు.. సీఎం కేసీఆర్ బొమ్మకు జీవితకాలం మొక్కిన తప్పు లేదన్నారు మోత్కుపల్లి.
ఈటల వెనుకాల ఇంత బాగోతం ఉందని ఎవరికీ తెలియదు అన్నారు. పేదోడిని, బీసీని అని చెప్పుకునే ఈటల రాజేందర్ దళితుల భూములను కబ్జా పెట్టడం దారుణం. దేవాలయ భూములు కబ్జా చేయడం సరికాదు. అసైన్డ్ భూములనే కబ్జా చేయాలన్న ఆలోచన ఈటలకు ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు సంపాదించుకోవడానికా? ప్రజల కోసమా? అని ప్రశ్నించారు.
దళితుల భూములను గుంజుకోవడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. నోరు తెరిస్తే ఈటల ఆత్మగౌరవం అంటున్నారు. ఇవాళ దళితుల భూముల కోసం ఈటల రాజేందర్ పోరాడి ఉంటే ఆయన పక్షాన ప్రజలు నిలబడేవారు. నీ విధానం ఆత్మద్రోహం అయినప్పుడు ప్రజలు నీ పక్షాన ఎలా నిలుస్తారని మోత్కుపల్లి ప్రశ్నించారు. కబ్జా చేసిన భూములను దళితులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇన్ని ఆస్తులు సంపాదించిన బీసీ నాయకుడు రాష్ర్టంలో ఎవరూ లేరని మోత్కుపల్లి స్పష్టం చేశారు. నాయకుడు అనే వాడు ప్రజల కోసం బతకాలి.. ప్రజల కోసం చావాలి అని అన్నారు. ఈటల ఉద్యమకారుడు కాదు.. అంతకన్నా ప్రజల మనిషి కాదు. బీసీ నాయకుడు ఈటలకు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. అందుకు కేసీఆర్కు ఈటల రాజేందర్ జీవితాంతం కృతజ్ఞతతో ఉండాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
ఇవి కూడా చదవండి..