అమరావతి : ఏపీలో డీఎస్సీ అక్రమాల ( DSC irregularities ) పై వైసీపీ నాయకులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ( YCP protests ) కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అక్రమాలపై సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని అన్నమయ్య జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో మదనపల్లి జాయింట్ కలెక్టర్కు సమర్పించారు.
మచిలిపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ డీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు లూటీ చేశారని విమర్శించారు. కడపలో వైసీపీ నాయకుడు రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని సాక్ష్యాలు ఇచ్చినా కాని చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగితో ప్రశ్నపత్రాలను అప్లోడ్ చేయించడం అక్రమాలకు నిదర్శనమని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలన్ని టీడీపీ నేతలు అమ్ముకున్నారని విమర్శించారు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న మంత్రి నారా లోకేష్కు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు .