Adilabad : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మరణించారు. దాంతో వారి పదేళ్ల కుమారుడు అనాథగా మిగిలాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని పిట్టలవాడకు చెందిన 33 ఏళ్ల నైతం నవీన్ కుమార్ స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య 31 ఏళ్ల లత గృహిణి. అయితే గత కొంతకాలంగా లత పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నది.
ఈ క్రమంలో శుక్రవారం జగిత్యాలలో చికిత్స చేయించుకుని తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచారు. శనివారం మధ్యాహ్నం కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో లత అంత్యక్రియలు నిర్వహించారు. అయితే భార్య మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన నవీన్ కుమార్.. శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో తుది శ్వాసవిడిచాడు. ఆయన కూడా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటున్నారని తెలిసింది.
భార్య చనిపోయిన కొన్ని గంటలకే భర్త కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. భార్య మరణాన్ని తట్టుకోలేకనే నవీన్ గుండె ఆగిపోయి ఉంటుందని స్థానికులు, బంధువులు భావిస్తున్నారు. ఒకేరోజు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఆ పదేళ్ల బాలుడు తండ్రి మృతదేహం వద్ద రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఆ చిన్నారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.