హైదరాబాద్ : రాష్ట్రంలో పేదలు ఆకలితో అలమటించొద్దన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం బేగంపేటలోని జురాస్టియాన్ క్లబ్లో లబ్ధిదారులకు ఆయన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు సబ్సిడీపై నిత్యావసరాలను అందించేందుకే తెల్లరేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 5,85, 756 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయని, వీటి ద్వారా 21,90,034 మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. నూతనంగా మరో 56, 064 తెల్లరేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని, వీటి ద్వారా మరో 2.25 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. కొత్తగా కార్డులు పొందిన వారికి ఆగస్టు నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత, సీఆర్ఓ బాల మాయాదేవి, డీఎస్ఓ రమేష్, ఆర్డీఓ వసంత, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.