హైదరాబాద్/నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ)/దేవరుప్పుల: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో రెండోరోజూ అదే హోరు కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి మొదలై సూర్యాపేట వరకు సాగింది. రాత్రి అక్కడే బసచేశారు. యువత, గులాబీ శ్రేణులు పెద్దసంఖ్యలో అక్కడికి తరలిరావడంతో క్యాంప్ గులాబీతోటను తలపించింది. కేసీఆర్తో ఫొటోలు దిగేందుకు యువత పోటీపడ్డారు. ఉదయం నుంచి భువనగిరికి బయలుదేరెంత వరకు ఫొటోలు దిగడం విశేషం. కేసీఅర్ స్థానిక నేతలు, యువతను, మహిళా నేతలను పేరుపేరునా పలకరించడంతో సంబురపడ్డారు. గురువారం సాయం త్రం సూర్యాపేట నుంచి కేసీఆర్ బస్సు యాత్ర భువనగిరికి పయనమైంది. కేసీఆర్ బయటకు వస్తుంటే పెద్ద సంఖ్యలో అప్పటికే గుమికూడిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు.
కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సు బయటకు వస్తుంటే టాటా చెప్తూ వీడ్కోలు పలికారు. సూర్యాపేట దాటి కొద్దిదూరం రాగానే తిమ్మాపూర్ వద్ద పెద్దసంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు గుమికూడారు. కేసీఆర్ను చూసి చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. బస్సుపై పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు. యువకులు పటాకులు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అర్వపల్లిలోనూ భారీ ఎత్తున ప్రజలు బస్సుకు ఎదురేగి పార్టీ జెండాలు చేతబట్టి పూలు చల్లారు. జై కేసీఆర్… జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. తిరుమలగిరిలోనూ పార్టీ కార్యకర్తలు, మహిళలు కేసీఆర్ను చూసేందుకు తరలివచ్చారు. కేసీఆర్ బస్సును చూడగానే కేరింతలు కొడుతూ చేతులెత్తి జై కొట్టారు. కేసీఆర్ అన్ని చోట్లా బస్సులో నుంచే అభివాదం చేస్తూ, నమస్కరిస్తూ ముందుకు సాగారు.
జనగామ జిల్లా దేవరుప్పుల వద్ద బస్సుయాత్రకు మాజీ మంత్రి ఎర్రబెల్లితోపాటు వందలాది నాయకులు, కార్యకర్తలు కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. దూరంగా ఫుట్పాత్పై నిలబడిన మాజీ మంత్రి ఎర్రబెల్లిని గమనించిన కేసీఆర్ నవ్వుతూ బస్సెక్కాలని సైగ చేశారు. బస్సెక్కిన ఎర్రబెల్లి కేసీఆర్ పక్కన కూర్చుని ప్రజలకు అభివాదం చేశారు. గంట వ్యవధిలో ఇంత మంది రావడంపై ఎర్రబెల్లిని కేసీఆర్ అభినందించినట్టు తెలిసింది. బస్సు యాత్ర జనగామ, ఆలేరు, మీదుగా భువనగిరికి చేరుకున్నది. మార్గమధ్యంలో ప్రతి పల్లెలోనూ కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. పూలు చల్లుతూ, పటాకులు పేల్చుతూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ నీరాజనం పలికాయి. చేతులు ఊపుతూ, బస్సుయాత్రను మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీస్తూ ప్రజలు మురిసిపోయారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి జననేత కేసీఆర్కు జేజేలు పలికారు. బిల్డింగులపై నుంచి బస్సుయాత్రను ఫొటోలు తీసుకున్నారు.
తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేటల్లో కిక్కిరిసిన జనంతో పోటీ పడేలా భువనగిరి పట్టణం కూడా జనసంద్రంగా మారింది. కేసీఆర్ రాక కోసం మధ్యాహ్నం నుంచే పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడం కనిపించింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, బస్సులు, డీసీఎంల్లో వచ్చిన ప్రజలు సాయంత్రం 5 గంటల వరకే భువనగిరికి చేరుకున్నారు. సాయంత్రానికి ఎటు చూసినా గులాబీ దళమే కనిపించింది. భువనగిరికి నలువైపులా నుంచి తరలి వచ్చిన జనంతో భారీ సందడి నెలకొన్నది. కేసీఆర్ భువనగిరికి చేరుకొని కొద్దిసేపు వివేరా హోటల్లో టీ బ్రేక్ తీసుకున్నారు. సరిగ్గా ఏడుగంటలకు అక్కడి నుంచి బయలుదేరి భువనగిరి పట్టణంలోకి బస్సు యాత్ర ప్రవేశించింది. పట్టణ శివారు నుంచే ప్రజలు బస్సుయాత్రకు ఎదురేగి స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్ మీదుగా పాత బస్టాండ్ నుంచి కేసీఆర్ రోడ్ షో మొదలైంది. డప్పుల నృత్యాలు, మహిళల బోనాలు, డోలు వాయిద్యాల నడుమ భారీ జన సందోహంతో రోడ్ షో కొనసాగింది. కిక్కిరిసిన జనాలతో అరగంటపాటు రోడ్ షోలో కేసీఆర్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్ షోలో పెద్దఎత్తున యువత చేసిన నినాదాలతో ఆ ప్రాంతంమంతా దద్దరిలింది. వినాయక చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
కేసీఆర్ బస్సులో నుంచి పైకి వస్తుంటే ఈలలు, కేరింతలు, చప్పట్లతో సభా ప్రాంతం దద్దరిల్లిపోయింది. అభిమాన నేతను చూస్తూ సీఎం సీఎం అని నినదించారు. దీనితో కేసీఆర్ వాళ్లను సమూదాయించాల్సి వచ్చింది. కేసీఆర్ ప్రసంగం బీజేపీపై పంచులతో మొదలైంది. పదేండ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏమైనా లాభం జరిగిందా అని కేసీఆర్ఆర్ ప్రసంగం మొదలుపెట్టగా లేదు.. లేదు.. అంటూ ప్రజలు స్పందించారు. ఒకరేమో దేవుని పేరుతో ఓట్లు అడుగుతున్నారని.. ఇంకొకరేమో దేవుళ్లపై ఒట్లు వేస్తూ ఓట్లు అడుగుతున్నారని పంచులు విసరగా జనం చప్పట్లతో స్పందించారు. కాషాయపు ఎజెండా కడుపు నింపుతదా, పొలాలకు నీళ్లు తెస్తదా ప్రజలు ఆలోచించాలని కోరగా తేదు.. తేదు.. అని సమాధానం వచ్చింది. ఇక కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగడుతుంటే మంచి స్పందన లభించింది. రైతు బంధు అందరికీ వచ్చిందా, రుణమాఫీ చేసిండా? అంటే.. లేదు.. లేదు.. అని అరుపులు పెట్టారు. ప్రజల పక్షాన కొట్లాడే పంచు ఎవరంటే… కేసీఆర్.. కేసీఆర్ అంటూ జనం చప్పట్లతో సమ్మతి తెలిపారు. క్యామ మల్లేశ్ను గెలిపించి బీఆర్ఎస్కు బలమియ్యాలని కోరగా హర్షధ్వానాలు వెల్లువెతాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో జరిగిన రెండు రోజుల బస్సు యాత్ర బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ను నింపింది.
సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 25 : కాళేశ్వరం నీళ్లు రాకపోవడంతో ఎండిన పంట చేనులో పండుకొని రోదించిన రైతు ధరావత్ నర్సింహకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధైర్యం చెప్పారు. బుధవారం రాత్రి రోడ్షో అనంతరం సూర్యాపేటలో బసచేసిన కేసీఆర్ సూర్యాపేట మండలం దుబ్బతండాకు చెందిన ధరావత్ నర్సింహను పిలుపించుకొని మాట్లాడారు. దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఆయనతో ఫొటో దిగి ఆత్మైస్థెర్యం నింపారు. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఏం పంటలు వేశావు.. అని కేసీఆర్ అడిగారు. నర్సింహ స్పందిస్తూ.. ‘సార్ నాకు అరెకరం భూమి ఉంది.
మీరు సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన కాళేశ్వరం నీళ్లతో నా భూమితోపాటు ఇంకో నాలుగున్నర ఎకరాలను కౌలుకు తీసుకొని వరి పెట్టాను. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో నీళ్లు ఇవ్వడం లేదు. దాంతో పొట్ట మీద ఐదెకరాల పంట ఎండిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసీఆర్ స్పందిస్తూ..ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన సమస్యలని, రైతులందరి సహకారంతో సర్కారుపై పోరాటం చేద్దామని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రం సాధించిన మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ లెక్కనా.. రైతులందరూ ధైర్యంగా ఉండాలి. మళ్లీ మనమే వస్తాం.. కాళేశ్వరం నీళ్లు తెచ్చుకుందాం. ధైర్యం కోల్పోవద్దు’ అని అభయమిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఆగమైతాంది. సాగు, తాగు నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. ఏ పథకం సక్కగ ఇస్తలేరు. ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నరు. మళ్లీ కేసీఆర్ సారే రావాలని ప్రజలంతా కోరుకుంటున్నరు. అందుకే ఆయన బస్సు యాత్రకు ప్రజలు వేలాదిగా వస్తున్నరు. జనాలంతా ఆయనకే మద్దతు తెలుపుతున్నరు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం.
-గునగంటి సైదులుగౌడ్, మాసాయిపేట, యాదగిరిగుట్ట మండలం
కేసీఆర్ సారు దేవుడసోంటోడు. ప్రజలను సొంత బిడ్డల్లెక్క చూసుకుండు. అనేక పథకాలను ఇచ్చి మాలాంటి పేదోళ్ల గుండెల్లో నిలిచిపోయిండు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మి ప్రజలు ఓటేసినందుకు గిప్పుడు బాధ పడుతున్నరు. గిప్పుడు ప్రభుత్వం నుంచి పేదలకు ఏం వస్తలేదు. నీళ్లు, కరెంటు సరిగ ఇస్తలేరు. పింఛన్లు పెంచలేదు. కేసీఆర్ సారు ఉన్నప్పుడే బాగుండె. మళ్లీ ఆయనే రావాలి.
-రేగు గౌరమ్మ, వీరవెళ్లి, భువనగిరి మండలం