Minister Srinivas Yadav | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. సచివాలయంలో గురువారం దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్న ఫిష్ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాలు, లబ్ధిదారులకు జరిగిన మేలుపై కరపత్రాల ద్వారా వివరించాలని సూచించారు. రాష్ట్రంలో సబ్సిడీ గొర్రెల యూనిట్లు పొందిన గొర్రెల పెంపకందారులు, ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన వాహనాలు, ఉచిత చేప పిల్లల ద్వారా లబ్ధిదారులు అత్యధికంగా ఉన్నారని, ఉత్సవాల్లో పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని చెప్పారు.
ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కార్యక్రమాలపై సమగ్ర కార్యాచరణను రూపొందించి జిల్లా, మండల అధికారులకు పంపించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉత్సవాలలో భాగంగా జూన్ 3న తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొనే విధంగా డెయిరీ అధికారులు, మత్స్య శాఖ అధికారులు, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 8న చెరువుల పండుగ సందర్భంగా ప్రధాన చెరువులు, రిజర్వాయర్ల వద్ద వేదికలను ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాల ను నిర్వహించాలని చెప్పారు.
ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ ఇతర పథకాలపై ప్లేక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు, ఫొటో ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పారు. కార్యాలయాలకు విద్యుత్ దీపాలంకరణ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని పశువైద్యశాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మేలుజాతి దూడల సంపద అభివృద్ధి కోసం కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది.
21 లక్షల కృత్రిమ గర్భధారణలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన నాణ్యమైన దూడల ప్రదర్శన నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. గోపాలమిత్రలు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా చూడాలని అన్నారు. ఇవే కాకుండా 21 రోజులపాటు ప్రతిరోజూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలలో కూడా భాగస్వాములు కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.