Rain Update | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అకడకడ కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 15 వరకు ఇదే విధమైన వాతావరణం నెలకొంటుందని ప్రత్యేక వాతావరణ బులెటిన్లో ప్రకటించింది. రాగల 24 గంటలకు ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. మరో పది జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షంతో రాష్ట్రంలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, మిగతా జిల్లాల్లో 40 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రజలు ఎండ, ఉక్కపోత నుంచి కాస్త ఊరట పొందుతున్నారు.
మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. గ్రేటర్ హైదరాబాద్తోపాటు పరిసర జిల్లాలకు ప్రత్యేక వెదర్ బులెటిన్ విడుదల చేసింది. రాగల 24 గంటలపాటు సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్టు ప్రకటించింది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 37 డిగ్రీలు, కనిష్ఠంగా 24డిగ్రీలు, గాలి వేగం గంటకు 10 నుంచి 40 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.
శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీచేసింది. శనివారం వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో, ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలపాటు కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. సోమవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.