హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫేక్ వీడియోకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు తెలంగాణ హైకోర్టులో అత్యవసర లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాసర్రెడ్డి గురువారం విచారణ జరిపారు. దిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది టీ సృజన్కుమార్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్షా చెప్పినట్టుగా రూపొందించిన ఫేక్వీడియో దేశమంతా వ్యాప్తి అయ్యిందని, దీనిపై దిల్లీ పోలీసులు నాగాలాండ్, జార్ఖండ్, యూపీ, ఎంపీ, రాజస్థాన్లోని పలువురికి నోటీసులు జారీచేశారని చెప్పారు. తెలంగాణలో కేసు దేశవ్యాప్త దర్యాప్తునకు అవరోధంగా మారిందని చెప్పారు. తెలంగాణలోని కేసును కూడా ఢిల్లీకి బదిలీ చేయాలని కోరారు. పిటిషనర్లకు చెందిన మొబైల్, ల్యాప్టాప్, డెస్టాప్ల నుంచి వీడియో ట్విట్టర్, ఫేస్బుక్లో అప్లోడ్ అయినట్లుందని చెప్పారు. అందుకే వాళ్లకు నోటీసులు ఇవ్వాల్సివచ్చిందని తెలిపారు. పిటిషనర్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తునకు సహకరించడం లేదని, దీంతో ఢిల్లీ పటియాలా కోర్టు నుంచి మన్నె సతీశ్, పీ నవీన్, కోయ గీతలపై నాన్ బెయిలబుల్ వారంట్ ఉత్తర్వులు పొందామని చెప్పారు. ఈ విషయాలను గోప్యంగా ఉంచి పిటిషనర్లు తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొందారని, వాటిని రద్దు చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులను సవరించడానికి నిరాకరించింది. తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది.
కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలపై ఢిల్లీలో నమోదైన ఎఫ్ఐఆర్లో దర్యాప్తు పేరుతో వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ దాఖలు చేసిన పిటిషన్లో ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఇదే వ్యవహారంలో హైకోర్టు.. వారిపై కఠిన చర్యలు తీసుకోరాదని గతంలో ఉత్తర్వులు జారీ చేసిందని, అవి అమల్లో ఉండగా పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించింది. గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఈ పిటిషన్పై విచారణ అవసరంలేదని స్పష్టం చేస్తూ, పిటిషన్ను డిస్మిస్ చేసింది.