హనుమకొండ చౌరస్తా, మే 9: విజయ డెయిరీ యాజమాన్యం 50 రోజులుగా పాల బిల్లులు చెల్లించడం లేదని పాడిరైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు గురువారం హనుమకొండలోని విజయ డెయిరీ డీడీ కార్యాలయం ఎదుట విజయ కాకతీయ పాడిరైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ కాకతీయ పాడిరైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇరుకు దేవేందర్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ డెయిరీకి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలో 10 వేల మంది సభ్యులు ఉండగా.. ప్రస్తుతం 5 వేల మంది 10 వేల నుంచి 15 వేల లీటర్ల పాలు పోస్తున్నారని తెలిపారు. వారికి ప్రతి 15 రోజులకోసారి చెల్లించాల్సిన బిల్లులను 50 రోజులు గడిచినా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏప్రిల్ నుంచి లీటర్కు రూ.5 చొప్పున అదనపు ప్రోత్సాహం ఇస్తానని చెప్పి ఇప్పటివరకు చెల్లించలేదని మండిపడ్డారు. సబ్సిడీ ఇన్ఫుట్స్ ఇవ్వడం లేదని, లీటర్కు రూ.5 అదనపు ప్రోత్సాహం వెంటనే ఇప్పించాలని, గతంలో ఉన్న అదనపు రూ.4 ప్రోత్సాహాన్ని కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నర్సంపేట, తొర్రూరు బీఎంసీయూ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ రాసాల సమ్మయ్య, సొసైటీ ప్రెసిడెంట్లు కే భిక్షపతి, ఎం సుధాకర్రావు, ప్రభాకర్, ఎం పూర్ణచందర్ పాల్గొన్నారు.