Sonakshi Sinha | దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్-యూజీ (NEET-UG) పరీక్షల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనే వార్తలతో పాటు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్తలు వెలువడిన అనంతరం సోనాక్షి సిన్హా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వీడియోలో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ నేటి యువత (Gen-Z) పోరాట స్ఫూర్తిని ప్రశంసించారు. ఆమె మాట్లాడుతూ.. “జెన్-జీని నేను తక్కువగా అంచనా వేశాను. కొద్దిసేపు నిరసనలు తెలుపుతారని అనుకున్నా. కానీ మీరు చూపించిన పట్టుదల, ఐక్యత నన్ను ఆశ్చర్యపరిచింది. మీ అందరికీ నా సెల్యూట్” అంటూ స్పందించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విద్యార్థుల సమస్యలపై సోనాక్షి సిన్హా గతంలో కూడా స్పందించారు. లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరసనకు ఆమె మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే విద్యార్థుల ఆందోళనల సందర్భంగా జరిగిన పోలీసుల చర్యలపై కూడా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. నీట్-యూజీ పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై పలువురు విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థలు విచారణతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపట్టడం, భవిష్యత్తులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానాన్ని అమలు చేయడం వంటి అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇక సోనాక్షి సిన్హా విషయానికి వస్తే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తెలుగులోను పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం హిందీలో అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది.