హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ఏర్పాటు చేశారు. తొలి సరళి 9 గంటలకు వెలువడనున్నది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా కొవిడ్ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో సహా పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కౌంటింగ్లో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లను సిబ్బంది లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్లో 400 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా సాగర్ ఉప ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, కాంగ్రెస్ నేత జానారెడ్డి మధ్య పోటీ నువ్వనేనా అన్నట్లుగా సాగింది.