బాల్కొండ, ఏప్రిల్ 26 : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మరిచిపోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు 140 రోజులు దాటినా పట్టించుకోవడంలేదని, అడిగితే ఆగస్టు 15లోపు పూర్తిచేస్తామని చెబుతున్నాడని మండిపడ్డారు. అప్పటి వరకు ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల పూర్తవుతాయంటే హామీలు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందన్నారు. శుక్రవారం ఆయన వన్నెల్(బీ), కిసాన్నగర్ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన రోడ్షోలో వేముల మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మంజూరైన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేయాలని ప్రయత్నం చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఆ పనులు పూర్తయితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అనేక అభివృద్ధి పనులు మంజూరు చేస్తూ తాను తీసుకొచ్చిన ప్రొసీడింగ్ కాపీలను తీసుకుని కలెక్టర్ వద్దకు వెళ్దామని, అవి బోగస్ పేపర్లంటే ఆ క్షణమే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తన సవాల్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో మహిళలు, రైతులు, యువతను నమ్మించి మోసం చేసిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో సురుకు పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఏనాడూ మన మంచీ చెడులకు రాలేదని, ఎమ్మెల్సీగా ఒక్క రూపాయీ ఇవ్వలేదన్నారు. బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఐదు రోజుల్లో పసుపు బోర్డు అని ఐదేండ్లయినా తీసుకురాలేదన్నారు. పంట సాగు తగ్గి పసుపు ధర పెరిగిందని, కానీ ఆయన చేసిన కృషి ఏమీలేదన్నారు. రాముడి పేరు, మోదీ పేరు మీద ఓట్లు అడుగుతున్న వారికి కర్రుకాల్చివాత పెట్టాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల మధ్యన ఉన్న మనిషి అని, 40 ఏండ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారని తెలిపారు. బాజిరెడ్డిని గెలిపించి తనకు తోడుగా బలం ఇవ్వాలని కోరారు. ప్రజల పక్షాన హామీల అమలు కోసం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మెడలు వంచుతామన్నారు. ప్రచా రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.