చిగురుమామిడి/ సైదాపూర్, ఏప్రిల్ 26: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలో, సైదాపూర్ మండలకేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
ఎంపీగా కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి బండి సంజయ్ ఐదేండ్లలో చేసిందేమీ లేదన్నారు. ప్రధాని మోదీ రోజు రోజుకూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, ఎన్నికల కోసం రాముడి ఫొటోలు వాడుకుంటూ మాయమాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జడ్పీటీసీ గీకురు రవీందర్, నాయకులు పాల్గొన్నారు.