కొడంగల్, ఏప్రిల్ 26: రేవంత్రెడ్డి సీఎంగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా పాత్రను పోషిస్తున్నట్లు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. శుక్రవారం కొడంగల్ విచ్చేసిన ఆమె స్థానిక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పున్నంచంద్ లాహోటీ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం అంటే ఏవిధంగా వ్యవహరించాలో తెలియదని, ఒక్కసారైనా మంత్రిగా వ్యవహరిస్తే కొంచెమైనా అవగాహన ఉండేదని ఎద్దేవా చేశారు. ప్రజల్లో మోదీ ప్రభంజనం కనిపించడంతో రేవంత్కు దిమ్మతిరిగి మతిస్థిమితం తప్పి మాటలు మాట్లాడుతున్నట్లు ఆరోపించారు. రేవంత్రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి కొడంగల్ అభివృద్ధికోసం ఏమీ చేయలేదన్నారు.
ఇప్పడు సీఎంగా అవకాశం వచ్చిందని మాటలు మాత్రమే చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని, కొడంగల్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా అభివృద్ధికి పటుపడాలన్నారు.. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజైనా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా.. ఎప్పుడైనా ప్రాజెక్టుల కోసం పోరాటం చేశారా అని అని ప్రశ్నించారు. ప్రజలపై, అభివృద్ధిపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ది లేదని, మాయమాటలతో గెలిచి ప్రజలకు అందుబాటులో లేకుండా స్వంతరాజకీయాలు చేసుకోవడం ఆయన నైజంగా పేర్కొన్నారు.
ఓడిపోతున్నామని తెలిసి రేవంత్కు మతి భ్రమించింది కాబట్టే మానవ బాంబునవుతా, పేగులు మెడల వేసుకుంటానని విచక్షణ రహితంగా మాట్లాడుతున్నట్లు ఆరోపించారు. ఎవరిని చంపి పేగులు మెడల వేసుకుంటావని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి ఏవిధంగా ప్రవర్తించాలో ముందు అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళలను చిన్న చూపు చూస్తూ.. నోటికి వచ్చిందల్లా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల మేలుకు పాటుపడే వ్యక్తి అయితే పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు తీసుకురావాలని సవాల్ విసిరారు.
జిల్లాలో ఏది మంజూరైనా నేనే సాధించానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, జాతీయ రహదారులకు కేంద్రం నుంచి నిధులు మంజూరు కానున్నట్లు గుర్తు చేశారు. గతం నుంచి కూడా కొడంగల్పై కల్వకుర్తి పెత్తనం కొనసాగుతున్నదని, మళ్లీ ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థి కల్వకుర్తి వ్యక్తి ఉన్నారని పేర్కొన్నారు. స్థానికంగా ఉండే నాయకులను పట్టించుకోకుండా తన కనుసన్నల్లో ఉండే వారికే ప్రాధాన్యత కల్పించిస్తున్నట్లు ఆరోపించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీతో పాటు బీజేపీ నాయకులు సదానంద్రెడ్డి, ప్రతాప్, సర్వేశ్ పాల్గొన్నారు.